ఈవిఎంలపై డౌట్, మాకు బ్యాలెట్ పత్రాలే కావాలి: సిద్ధు
బెంగళూరు: ఈవిఎంలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. వచ్చే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వాడాలని ఆయన డిమాండ్ చేశారు.
గుజరాత్ ఫలితాలు కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాన్ని ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలోని సమస్యలు భిన్నమైనవని అన్నారు. తాను కొంత మంది నిపుణులతో మాట్లాడానని, ఈవిఎంలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు చెప్పారని ఆయన అన్నారు.
"వారు (బిజెపి) అధికారంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ వారి కింద ఉంది. అది స్వతంత్ర సంస్థ అయినప్పటికీ వారు (కేంద్ర ప్రభుత్వం) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తారు" అని ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడంపై ప్రశ్నించినప్పుడు అన్నారు.
తాము పాత పద్ధతి (బ్యాలెట్ పేపర్లు)కి వెళ్లాలని తాము అడుగుతున్నామని, అందులో ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన రాయచూర్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. పలు దేశాలు ఈవిఎంల స్థానంలో బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాయని ఆయన గుర్తు చేస్తూ వచ్చే ఏడాది జరిగే కర్ణాటక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వాడాలని డిమాండ్ చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందనే అంచనాలను ప్రస్తావించగా, ఓట్ల లెక్కింపు జరగాల్సే ఉందని, అవి ఎగ్జెట్ పోల్ ఫలితాలు మాత్రమేనని సిద్దరామయ్య అన్నారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పిన సందర్బాలు చాలా ఉన్నాయని డిసెంబర్ 18వ తేదీన ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.