బీజేపీ బటన్ నొక్కిందని కేజ్రీ, మిడ్నైట్ హవాలాపై సై: ఖుష్బూ,కృష్ణంరాజు ప్రచారం
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నందున ఢిల్లీ రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు, సెటైర్లు వేసుకుంటున్నాయి. బీజేపీ, ఏఏపీలు కౌంటర్లు విసిరుకుంటున్నాయి. దాదాపు ఈ రేసు నుండి కాంగ్రెస్ పార్టీ తప్పుకుందని చెప్పవచ్చు. సర్వేల్లోను, ప్రచారంలోను కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. బీజేపీ, ఏఏపీల మధ్యనే పోటా పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త బీజేపీ పైన విరుచుకుపడుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మంచి మహిళ అంటూనే.. బీజేపీ ఆమెను ఉపయోగించుకొని గెలవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యలకు ధీటుగానే స్పందిస్తోంది. వ్యంగ్య కార్టూన్ల రగడ సోమవారం ఢిల్లీలో మరింత రాజకీయ వేడిని రాజేసింది.
వ్యంగ్య కార్టూన్ల పేరిట బీజేపీ తన ప్రత్యర్ధి పార్టీలపై వ్యతిరేక ప్రచారం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ను టార్గెట్ చేసుకున్నారు. ఆయనను విమర్శిస్తూ నిత్యం కార్టూన్ల ప్రకటనలను గుప్పిస్తున్నారు. వీటిపై బీజేపీ, ఏఏపీలు మాటల యుద్ధం సాగిస్తున్నాయి.
కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ విడుదల చేసిన కార్టూన్ కూడా ఢిల్లీలో తీవ్ర దుమారం రేపుతోంది. గణతంత్ర వేడుకలపై కేజ్రీవాల్ వైఖరిని అపహాస్యం చేస్తూ.. కేజ్రీది ఉపద్రవం కలిగించే గోత్రమని ఓ కార్టూన్లో పేర్కొంది. దీంతో బీజేపీపై ఏఏపీ విమర్శలు గుప్పించింది.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమని ఏఏపీ, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ అగర్వాల్ కులానికి చెందినవారని, బీజేపీ చేసిన కార్టూన్ ప్రకటన ఆ కులానికి చెందిన వారందరిని నిందిస్తున్నట్లుగా ఉందని మండిపడుతున్నారు. ఈ ప్రకటనపై బీజేపీ క్షమాపణ చెప్పకపోతే ఈసీని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
కేజ్రీవాల్ కూడా ఈ కార్టూన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బీజేపీ ఇప్పటివరకూ తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని కార్టూన్లు వేసినా నోరుమెదపలేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారు సహనం వహించాలన్న అన్నా హజారే మాటల మేరకే మౌనంగా ఉండిపోయానన్నారు.
అయితే కేవలం తన కుటుంబాన్నే కాకుండా పూర్తిగా అగర్వాల్ కులస్తులందరినీ అపహాస్యం చేసిందని బీజేపీపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆ పార్టీ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారిపోయిందన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి అంశాల ఆధారంగా విమర్శలు సరికాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వీ అన్నారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై..
తమ పైన అవమ్ చేసిన మనీలాండరింగ్ ఆరోపణల పైన కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. విచారణ జరిపించి, తాను తప్పు చేసినట్లుగా తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని ఓ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ చెప్పారు. తనపైన మిడ్ నైట్ హవాలా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ఇప్పటికే ఎన్నికల్లో ఓడిందని, అందుకే తమ పైన కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటమి చెందకుండా ఉండేందుకు బీజేపీ విష రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఇప్పుడు భయం అనే బటన్ నొక్కిందని (పానిక్ బటన్) ఎద్దేవా చేశారు.
కిరణ్ బేడీ చేరికతో...
బీజేపీ, ఏఏపీల మధ్యనే పోటీ ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని సర్వేలు అంటున్నాయి. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని కొన్ని, మెజార్టీకి రెండు మూడు స్థానాలు తగ్గుతాయని మరికొన్ని చెబుతున్నాయి.
కిరణ్ బేడీ బీజేపీలో చేరడం ఆ పార్టీకీ నష్టం కలిగిస్తుందని కొందరు, లాభిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పంజాబీ అయిన ఆమె రాకతో పూర్వాంచల్ వాసుల్లో అసంతృప్తి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. పూర్వాంచల్లో 24 శాతం మంది ఓటర్లు ఉన్నారు.
ప్రచారంలో ప్రముఖులు....
ఆయా పార్టీల తరఫున హేమాహేమీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రవిశంకర ప్రసాద్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు తదితరులు పాల్గొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కొందరు ముఖ్యనేతలు ఉన్నప్పటికీ కేజ్రీవాలే కీలక నేత. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా, రాహుల్, షానవాజ్ హుస్సేన్, ఖుష్బూ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు.