కర్నాటకం: కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం..?
బెంగళూరు: కర్నాటకలో రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు అవకాశాలు వచ్చిన్నప్పటికీ వాటిని బీజేపీ వినియోగించుకోవడంలో విఫలమైనట్లు సమాచారం. అయినా సరే కుమారస్వామి సర్కార్ను పడగొట్టే ప్రయత్నం మాత్రం విరమించుకోబోమని ఆ రాష్ట్ర బీజేపీ చెబుతోంది. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలొచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెబుతున్నారు కమలనాథులు.
పేపర్కే పరిమితమైన బెలగావి అంశం
లింగాయత్, ఉత్తరకర్నాటక అంశాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కలవరపాటుకు గురించేస్తున్నాయి. బెలగావిని రెండో రాజధానిగా కుమారస్వామి ప్రకటించినప్పటికీ, సువర్ణ విధాన సౌధ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పినప్పటికీ అవి కాగితంపైకే పరిమితం అయ్యాయి కానీ అధికారికంగా వాస్తవరూపం దాల్చలేదు. ఈ హామీలు నెరవేరకుంటే తమ రాజకీయ మనుగడ కష్టమవుతుందని లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి భద్రత లేదని భావించి బీజేపీ నేతలతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో రేవన్న గౌడ జోక్యం
ఇదిలా ఉంటే సీఎం కుమారస్వామి సోదరుడు పీడబ్ల్యూడీ మంత్రి రేవన్న గౌడ కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో తలదూర్చడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభత్వంలో దేవెగౌడ కుటుంబం జోక్యం ఎక్కువైపోయిందని కాంగ్రెస్ వారు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఆయా శాఖల మంత్రులకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ తెలియకుండానే దేవెగౌడ కుటుంబం అధికారులను ట్రాన్స్ఫర్ చేసిందనే అసంతృప్తి కాంగ్రెస్ మంత్రుల్లో నెలకొంది. ఇంకా దారుణమేమిటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కర్నాటకలో దేవెగౌడ కుటుంబం జోక్యం మితిమీరిపోతోందని ఫిర్యాదు చేసినప్పటికీ... అధిష్టానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చూసి చూడనట్లుగా వెళ్లాలని తిరిగి మంత్రులకు ఎమ్మెల్యేలకే హితబోధ చేసింది.
తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పదవీ వ్యామోహం
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఇందుకోసం బీజేపీలోని ధనవంతులను ఎరవేస్తోందని ఆరోపించారు. మరోవైపు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా సముచిత స్థానం కావాలని డిమాండ్ చేయడం కర్నాటక రాజకీయాల్లో రివాజుగా మారిందన్నారు. అధికారం కోసం ఆగలేకున్నారని తెలిపారు. ఇలా ఉన్నవారిలో ఒక డజను మంది ఎమ్మెల్యేలున్నారని విశ్వసనీయ సమాచారం.
బీజేపీకి కలిసి వస్తున్న కాంగ్రెస్ అంతర్గత విబేధాలు
జార్కీహోలీ సోదరులు, డీకే శివకుమార్ మధ్య కొన్ని రోజులుగా ముసుగులో గుద్దులాట జరుగుతోందని అది ఏదో ఒకరోజు బహిర్గతం అవుతుందని అప్పుడు కాంగ్రెస్లో చీలిక ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు కమలనాథులు. అంతేకాదు మాజీ సీఎం సిద్ధరామయ్య హోసకోటే ఎమ్మెల్యే నాగరాజ్ మధ్య కూడా విబేధాలు ముదురుతున్నాయని అది కూడా కలిసివస్తుందని బీజేపీ నేతలు ఆశతో ఉన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే బీజేపీకి కలిసొస్తుందని ఈ చిన్న విబేధాలతోనే ప్రభుత్వం కూలిపోతుందని అంచనా వేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అది కూడా త్వరలోనే జరుగుతుందని భావిస్తున్నారు.