యూనివర్శిటీలపై మోడీ-షా మార్క్ సర్జికల్ స్ట్రైక్: గూండాలతో దాడి: మమతా బెనర్జీ ఫైర్..!
కోల్ కత: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్న ఏకైక నాయకురాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నయినా తనదైన శైలిలో విమర్శిస్తుంటారు.. నిప్పులు చెరుగుతుంటారు. తాజాగా- న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యూ)లో చోటు చేసుకున్న పరిణామాలపైనా ఆమె తనదైన శైలిలో స్పందించారు.
సర్జికల్ స్ట్రైక్ గా..
జెఎన్యూ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఉదంతాన్ని మమతా బెనర్జీ.. మరో సర్జికల్ స్ట్రైక్ గా అభివర్ణించారు. సోమవారం ఆమె కోల్ కతలో విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన విధంగానే బీజేపీ ప్రభుత్వం ఈ సారి విశ్వవిద్యాలయాలు, ప్రతిష్ఠాత్మక కళాశాలలపై తన ప్రతాపాన్ని చూపిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునేవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలేనని అన్నారు.
నిర్ణయాలను వ్యతిరేకించిన వారిపై పాక్ ముద్ర..
తాము తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే ప్రజలపై కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహులుగా, పాకిస్తానీయులుగా ముద్రను వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జెఎన్యూ విద్యార్థులపై దాడికి పాల్పడింది బీజేపీ గూండాలేనని ధ్వజమెత్తారు. జెఎన్యూ విద్యార్థులు తమకు వ్యతిరేకంగా ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో బీజేపీ తన సొంత గూండాలను పంపించి, దాడులు చేయించిందని విమర్శించారు.
ప్రజాస్వామ్యంపై దాడిగా..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై చోటు చేసుకున్నట్లుగానే ఈ సారి కూడా బీజేపీ విద్యార్థులను లక్ష్యంగా నిర్దేశించుకుందని అన్నారు. జెఎన్యూ ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. పోలీసులను సైతం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. తమ ఉన్నతాధికారులే దాడులకు ప్రేరేపిస్తే.. పోలీసులు మత్రం ఏం చేయగలుగుతారని అన్నారు.