బళ్లారి శ్రీరాములను ఢిల్లీకి పిలిచిన బీజేపీ హైకమాండ్, గాలికి బెయిల్ వస్తేనే, ఏం చేస్తారు?
న్యూఢిల్లీ/బళ్లారి: లోక్ సభ ఉప ఎన్నికల్లో బళ్లారిలో అతిదారుణంగా ఓడిపోయి విచారంతో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీరాములను ఢిల్లీకి రావాలని బీజేపీ హైకమాండ్ సూచించింది. బళ్లారిలో సిట్టింగ్ ఎంపీ సీటును ఎందుకు గెలిపించలేకపోయారు అని ప్రశ్నించడానికా ? ఒంటరిగా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినందుకు శ్రీరాములను అభినందించడానికా ? అనే విషయం బీజేపీ నాయకులకు అంతుపట్టడం లేదు. అయితే గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చిన తరువాత ఢిల్లీ వెళ్లాలని శ్రీరాములు నిర్ణయించారని తెలిసింది.
బెయిల్ రావాలి!
బెంగళూరు సీసీబీ పోలీసుల వేటతో అజ్ఞాతంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఇంకా బెయిల్ రాకపోవడంతో శుక్రవారం ఢిల్లీ పర్యటనను శ్రీరాములు వాయిదా వేసుకున్నారని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చిన వెంటనే శ్రీరాములు ఢిల్లీ వెళ్లి బీజేపీ చీఫ్ అమిత్ షాను భేటీ కానున్నారు.
నాయకులు హ్యాండ్ ఇచ్చారు
కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు బళ్లారిలో ఉప ఎన్నికల ప్రచారం చెయ్యకుండా హ్యాండ్ ఇచ్చారని, ఉత్తర కర్ణాటకాకు చెందిన నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని శ్రీరాములు హైకమాండ్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం. మాజీ సీఎం, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప సైతం బళ్లారికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని శ్రీరాములు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.
బళ్లారి అభ్యర్థి ఎవరు ?
బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో శ్రీరాములు సొంత సోదరి శాంతా ఊహించనిరీతిలో ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికలకు బళ్లారిలో అభ్యర్థిని మార్చాలని బీజేపీ నాయకులు నిర్ణయించారని తెలిసింది. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ఇప్పటి నుంచే తయారు చెయ్యాలని హైకమాండ్ శ్రీరాములకు సూచించిందని సమాచారం.
సిద్దరామయ్యకు పోటి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పోటీగా శ్రీరాములను వెనుకబడిన వర్గాల నాయకుడిగా బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అది కాస్తా రివర్స్ కావడంతో బీజేపీ హైకాండ్ అయోమయంలో పడిపోయింది. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల ఓటమిని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ 2019 జరిగే లోక్ సభ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీరాములుకు సూచించే అవకాశం ఉందని తెలిసింది.
డీకే శివకుమార్ కు చెక్
బళ్లారిలో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. డీకే శివకుమార్ ను కట్టడి చేసే బాధ్యత శ్రీరాములకు అప్పగించే అవకాశం ఉందని కర్ణాటక బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద శ్రీరాములు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన తరువాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు అంటున్నారు.