యడియూరప్పకు షాకిచ్చిన బీజేపీ, ఇంత మంది పేర్లా ? మంత్రివర్గం, అమిత్ షా !
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి హైకమాండ్ అనుమతి తీసుకోవడానికి సీఎం యడియూరప్ప ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీ నాయకులు భేటీ కావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అయోమయంలో పడిపోయారు. మంత్రివర్గంలో చోటు కోసం చాల మంది పోటీ పడుతున్నారనే హైకమాండ్ ఆలస్యం చేస్తోందని తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోడీ
గురువారం సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఢిల్లీ వెళ్లారు. శుశ్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం యడియూరప్ప భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం అనేక మంది బీజేపీ నాయకులతో సీఎం యడియూరప్ప భేటీ కావాల్సి ఉంది.
ఇప్పుడు టైం లేదు
సీఎం యడియూరప్పతో భేటీ కావడానికి బీజేపీ నాయకులు సమయం ఇవ్వలేదని సమాచారం. శుక్రవారం సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కార్యాధ్యక్షుడు జేపీ. నడ్డాతో సీఎం యడియూరప్ప ముందుగా అనుకున్న సమావేశం రద్దు అయ్యింది. వీరి సమావేశానికి ఇంకా టైం ఫిక్స్ కాలేదని తెలిసింది.
ఎంత మంది పేర్లు ?
శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో యడియూరప్ప భేటీ కావాల్సి ఉంది. అయితే అమిత్ షాతో సమావేశం వాయిదా పడిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా చాంతాడు అంత పెద్దదిగా ఉందని సమాచారం.
గ్రీన్ సిగ్నల్ వస్తుందని !
యడియూరప్ప ముందుగా తయారు చేసుకుని వెళ్లిన జాబితా పరిశీలించిన బీజేపీ హైకమాండ్ మంత్రి వర్గం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. యడియూరప్ప సిద్దం చేసిన జాబితాలో చాల మందికి మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ సిద్దంగా లేదని తెలిసింది.
అయోమయంలో సీఎం
మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆ జాబితాను బీజేపీ హై కమాండ్ పరిశీలిస్తున్నదని తెలిసింది. మంత్రివర్గం ఏర్పాటు చెయ్యడం ఆలస్యం అవుతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు వారాలు అవుతోంది. అయినా మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడం యడియూరప్పకు ఇంత వరకు సాధ్యం కాలేదు.