సత్తా చాటిన గాలి జనార్దన్ రెడ్డి, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తో దూకుడు, రీఎంట్రీ, అవసరం !
శివమొగ్గ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన ప్రభావం మాత్రం తగ్గడం లేదు. గాలి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటేనే మనకు లాభం అని బీజేపీ నాయకులు ఓ అంచనాకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు.
రెడ్డి బహిరంగ ప్రచారం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బుధవారం శివమొగ్గలో విలేకరులతో మాట్లాడుతూ ఏఏ నియోజక వర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం అవసరమో ఆ నియోజక వర్గాల్లో ఆయన బహిరంగ ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు.
హైకమాండ్ ఆదేశం
చిత్రదుర్గ జిల్లా మోళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో బళ్లారి ఎంపీ శ్రీరాములుకు మద్దతుగా గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రతిపక్షాల విమర్శలతో గాలి జనార్దన్ రెడ్డిని బహిరంగ ప్రచారం చెయ్యకూడదని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. రెండు రోజులుగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు.
అమిత్ షాపై ఒత్తిడి
గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తేనే కొన్ని నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని, లేదంటే నష్టం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు ఒత్తిడి చేశారని తెలిసింది. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక్క అడుగు వెనక్కి వేసి గాలి జనార్దన్ రెడ్డి బహిరంగ ప్రచారం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఒక్కసారిగా రివర్స్
గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల మైసూరులో అన్నారు. బహిరంగ ప్రచారం చెయ్యరాదని రెండు రోజుల క్రితం గాలి జనార్దన్ రెడ్డికి హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే బీజేపీ నాయకులు ఒక్కసారిగా మాటమార్చి గాలి జనార్దన్ రెడ్డి బహిరంగ ప్రచారం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెడ్డి రీ ఎంట్రీ
శాసన సభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి బహిరంగ ప్రచారం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ త్వరలో ఆయన్ను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని బీఎస్. యడ్యూరప్ప, బి. శ్రీరాములుతో పాటు అనేక మంది బీజేపీ నాయకులు అధిష్టానం మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.