ఎల్లుండి కేంద్ర కేబినెట్ రీ షఫుల్! 9 మంది ఔట్.. కొత్తగా ఏడుగురు? అశోక్ గజపతిరాజు శాఖ మార్పు?
ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నివాసంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
న్యూఢిల్లీ : త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని విస్తరించే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. గురువారం జరిగిన ఈ భేటీకి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, జితేంద్ర సింగ్, నిర్మల సీతారామన్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్ను విస్తరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే.
బిక్స్ సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళుతున్నారు. చైనా నుంచి ఆయన నేరుగా మయన్మార్ వెళుతారు. సెప్టెంబర్ 7న మయన్మార్ పర్యటన ముగుస్తోంది. అనంతరం పితృ అమావాస్య వస్తుండటం.. ఇది మంచి ముహూర్తం కాదని భావిస్తుండటంతో ప్రధాని మోడీ చైనా పర్యటన లోపే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించే అవకాశముందని వినిపిస్తోంది.
సెప్టెంబర్ 1, 2వ తేదీల్లోపు విస్తరణ ఉండే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి చేపట్టే మంత్రివర్గ విస్తరణ భారీ స్థాయిలో ఉండే అవకాశముందని, పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చునని అంటున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండే అవకాశముందని సమాచారం.
ఇక కొత్తగా ఎన్డీయే గూటిలో చేరిన అన్నాడీఎంకే, జేడీయూలకు కూడా కేంద్ర కేబినెట్లో బెర్తులు దక్కే అవకాశముంది. మహారాష్ట్రలో బీజేపీకి సన్నిహితమవుతున్న ఎన్సీపీ కూడా కేంద్ర కేబినెట్లో చేరొచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి.
బీజేపీ, అమిత్షా, కేంద్ర కేబినెట్ విస్తరణకేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారన్న వార్తల నేపథ్యంలో 9 మంది మంత్రులు ఉద్వాసనకు గురికాబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి పార్టీ పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అరుణ్ జైట్లీ రక్షణ శాఖలో కొనసాగేందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రిగా తాను ఎంతో కాలం ఉండే అవకాశం లేదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు నిర్వహిస్తోన్న పౌరవిమానయాన శాఖను నితిన్ గడ్కరీకి అదనంగా అప్పజెప్పబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోకి కొత్తగా ఏడుగురిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్తగా మంత్రులు కాబోతున్నవారు... రామ్నాథ్ ఠాకూర్ (జేడీయూ), ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలి చైర్మన్ హేమంతబిశ్వ శర్మ, వినయ్ శాస్త్ర బుద్ధే, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్. మరోవైపు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవుల నుంచి ఉద్వాసనకు గురి కాబోతున్నవారిలో వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ, మహేశ్ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది.