81 శాతం పెరిగిన బిజెపి ఆదాయం, పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ రెవిన్యూ
న్యూఢిల్లీ: బిజెపి ఆదాయం గత రెండేళ్ళలో సుమారు 81.18 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం మాత్రం 14 శాతానికి పడిపోయింది ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని ఏడిఆర్ నివేదికలో స్పష్టం చేసింది.
ఏడిఆర్ నివేదిక ప్రకారంగా రూ.1,034.27 కోట్లుగా ఉన్నట్టుగా ఎన్నికల సంఘానికి బిజెపి తెలిపింది.అయితే అంతకు ముందు బిజెపి ఆదాయం దీని కంటే రూ.463.41 కోట్ల ఆదాయంగా ఉంది. 2016-17 సంవత్సరానికి గాను ఇతరత్రా అవసరాల కోసం పార్టీ సుమారు రూ. 710.057 కోట్లు ఖర్చు చేసిందని బిజెపి ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీకి లభించిన ఆదాయం కంటే రూ.96.30 కోట్లు ఎక్కువగా ఖర్చు చేసింది. పార్టీ ఖర్చు కింద రూ.321.66 కోట్లుగా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ నివేదికను సమర్పించింది. దేశంలో ఏడు జాతీయ పార్టీలు సుమారు రూ.1,559.17 కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి. పార్టీ ఖర్చుల నిమిత్తం కోసం రూ.1,228.26 కోట్లు ఖర్చు చేశాయని ఏడీఆర్ నివేదికను విడుదల చేసింది.
పార్టీల మొత్తం ఆదాయంలో స్వచ్ఛంద విరాళాల కిందే రూ.1,169.07 కోట్లు వచ్చాయని వెల్లడించింది. ఈ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఉన్నాయి.