యువ భారతం : యూత్ ఓటు ఎవరికి..? దేశ ప్రధానిగా ఎవరి వైపు చూస్తోంది..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారం అంతా యువత వైపే తిరిగింది. దేశంలోని జనాభాలో 50శాతం మంది 28 ఏళ్లలోపు వారే ఉండటంతో ఆయా పార్టీల నాయకులు యువత ఓట్ల కోసం పెద్ద ఎత్తున పాకులాడారు. అయితే యువత ఎవరి వైపు మొగ్గు చూపారు..? యూత్ ఎవరి నాయకత్వాన్ని బలపరుస్తోంది..? యువతను ఆకట్టుకున్న పార్టీ ఏది..?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించింది. దేశానికి భవిష్యత్ అయిన యువత తమ తీర్పును తమ నాయకుడిని ఎన్నుకుంది. వారు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే యువత బీజేపీ వైపే నిలిచినట్లు తేలింది. తమ నాయకుడిగా నరేంద్ర మోడీకే పట్టం కట్టినట్లు అంచనాలు వెల్లడి చేస్తున్నాయి. ఒక జాతీయ మీడియా చేసిన దాదాపు 7 లక్షల మంది ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో 80శాతం మంది 50 ఏళ్లలోపు వారు ఉన్నారు. 20 శాతం మంది 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారున్నారు. 26 ఏళ్లు నుంచి 35 ఏళ్ల లోపు వారు 31 శాతం ఉన్నారు. 36 నుంచి 50 ఏళ్ల మధ్య 32శాతం మంది ఉన్నారు. 51 నుంచి 60 ఏళ్ల మధ్య 11 శాతం మంది ఉండగా... 61 ఏళ్లు పైబడి ఉన్న వారు 6శాతం ఉన్నారు.
ఇక 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నవారు చాలామంది బీజేపీకే మద్దతు తెలిపారు. ఈ వయస్సు మధ్య ఉన్న వారు దాదాపు 46శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు తెలిపారు.26 శాతం మంది కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. అయితే ఇక్కడ యువతతో పాటు అన్ని వయస్సుల వారు బీజేపీకి మద్దతు తెలిపారు.ఇక బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన వారిలో ఉద్యోగాలు చేసుకుంటున్న 26 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వారే ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గంలో దాదాపు 46 శాతం మంది బీజేపీకి జైకొట్టారు.ఇదే వర్గం నుంచి 26.5 శాతం మంది కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎప్పటిలాగే ఈ సారి కూడా వృద్ధులు మద్దతు తెలిపారు.కానీ ఇందులో కూడా కాస్తో కూస్తో బీజేపీకి మద్దతు తెలిపారు.60 ఏళ్ల పై బడి ఉన్నవారు కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ ఇచ్చారు. అన్ని వయస్సుల వారితో పోల్చిచే కాంగ్రెస్కు అత్యధికంగా 60 ఏళ్ల పైబడిన వారే ఓటు వేసినట్లు ఎగ్జిట్ ఫలితాలు తెలిపాయి.ఇక 61 ఏళ్లు ఉన్న వారు 44శాతం మంది బీజేపీకి ఓటు వేయగా... ఇతరుల వైపు 26శాతం మంది చూశారు.
ఇక తమ అభ్యర్థులను బరిలో నిలిపిన జాతీయ పార్టీల్లో కమలం పార్టీ 8శాతం మంది యువతకు టికెట్ ఇవ్వగా... కాంగ్రెస్ పార్టీ 12 శాతం మంది యువతకు టికెట్ కేటాయించింది.ఇక వృద్ధులకు యువతకంటే మూడు రెట్టు ఎక్కువగా టికెట్లు ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ కంటే బీజేపీ వైపే యువత మొగ్గు చూపినట్లు పోస్ట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయ.