ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి భయం: మరోసారి రామమందిర జపం: ఒవైసీ..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్టును ఏర్పాటు చేయడం పట్ల అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణ విషయాన్ని తెర మీదికి తీసుకొచ్చారని అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం భారతీయ జనతా పార్టీకి పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ, అమిత్ షా రామమందిర నామాన్ని జపం చేస్తున్నారని అన్నారు.
ఈ నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారని, 6వ తేదీ సాయంత్రానికి ప్రచారం పరిసమాప్తం అవుతుందని, ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని హఠాత్తుగా నరేంద్రమోడీ లోక్సభలో ఈ ప్రకటన చేశారని విమర్శించారు. దీన్ని ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు.
పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఈ నెల 11వ తేదన ముగియబోతున్నాయని గుర్తు చేశారు. రామమందిరం ఆలయ ట్రస్టు వివరాలను 8వ తేదీ తరువాత ఎందుకు ప్రకటించకూడదని ఒవైసీ ప్రశ్నించారు. పోలింగ్ ముంగిట్లోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనుక గల కారణాలు అందరికీ తెలిసినవేనని చెప్పారు. మరోవంక- లోక్సభలో ప్రధానమంత్రి చేసిన ప్రకటన.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. దీనిపై వారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.