ఎంపీలకు బీజేపీ విప్ జారీ.. పార్లమెంట్ సమావేశాలకు రావాలని ఆదేశం..
తమ పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రశ్నలపై సమాధానాలిచ్చే అవకాశం ఉండటంతో రాజ్యసభ,లోక్సభకు ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. నిర్మలా సీతారామన్ తొలుత లోక్సభలో,ఆ తర్వాత రాజ్యసభలో మాట్లాడుతారని తెలుస్తోంది.
కాగా,ఈ నెల ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.30.42 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో.. మూడు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీటికి రూ. 2.83 లక్షల కోట్లు కేటాయించారు. విద్యా రంగానికి రూ.99,300 కోట్లు కేటాయించగా.. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు,మహిళల సంక్షేమ కార్యక్రమాలకు రూ.28,600 కోట్లు కేటాయించారు.
2024 నాటికి దేశంలో కొత్తగా 150 యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని నిర్మలా బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే దేశంలోని టాప్-100 యూనివర్సిటీల్లో ఆన్లైన్ డిగ్రీ కోర్సులను తీసుకొస్తామన్నారు. ఇక 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నట్టు చెప్పారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేదిగా.. దేశ అభివృద్దికి తోడ్పడేదిగా ఉందని బీజేపీ అంటుంటే.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మాత్రం విపక్షాలు గుప్పిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యను కేంద్రం గాలికి వదిలేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శిస్తూనే ఉన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నమే చేయలేదని ఆయన అంటున్నారు.