సిద్దరామయ్యకే దిక్కులేదు, ఇక రాహుల్ గాంధీకి ఆహ్వానమా, దోందూ దోందే ఓడిపోతారు: బీజేపీ!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని రాహుల్ గాంధీని సిద్దరామయ్య ఆహ్వానించడంతో బీజేపీ నాయకులు దోందూ దోందే అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సిద్దరామయ్య మరో నాయకుడు పోటీ చెయ్యాలని ఆహ్వానించి కార్పెట్ పరుస్తున్నారని బీజేపీ ఎద్దేవ చేస్తోంది. మీరు గెలవలేని నాయకుడు, మరో నాయకుడిని పోటీ చెయ్యాలని ఇక్కడికి ఆహ్వానించి ఆయనను ఓడించి మీ పార్టీ పరువు తీసుకుంటారని బీజేపీ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించడానికి, వారిని ఉత్తేజ పరచడానికి కర్ణాటక ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ విషయంలో అది నిజం అయ్యిందని సిద్దరామయ్య అన్నారు. అందువలనే తాము కాబోయే ప్రధాని రాహుల్ గాంధీని కర్ణాటక నుంచి పోటీ చెయ్యాలని ఆహ్వానిస్తున్నామని సిద్దరామయ్య ట్వీట్ చేశారు.
ఈ విషయంపై బీజేపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. మొదట ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే విషయంలో సిద్దరామయ్య శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయి సత్తా లేని వ్యక్తి ఓటమిపాలయ్యే మరో వ్యక్తిని ఆహ్వానిస్తున్నారని సిద్దరామయ్య మీద మండిపడుతున్నారు.