బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!
రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇలా టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుని క్యాంపెయిన్ చేయడంలో బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందుంది. ఇందుకోసం పార్టీ ఐటీ విభాగం కొందరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తుంది. అలా ట్రైనింగ్ తీసుకున్న వారిలో బెంగాల్కు చెందిన దీపక్ దాస్ ఒకరు. కూచ్ బెహర్ జిల్లాకు చెందిన ఆయన వాట్సప్లో చేస్తున్న ప్రచారం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
తీపికబురు! ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఎల్ నినో బలహీనం!
1114 గ్రూపులకు అడ్మిన్
కూచ్ బెహార్లో బీజేపీ నాయకుల్లో ఒకరైన దీపక్దాస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. బీజేపీ డిస్ట్రిక్ ఐటీ సెల్ కన్వీనర్ అయిన దీపక్ ఏకంగా 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్గా ఉన్నారు. పార్టీకి చెందిన ఫేస్బుక్ పేజీ, ట్విట్టర్ అకౌంట్ను ఈయనే హ్యాండిల్ చేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపక్ తొలుత ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో వారి నుంచి ఫోన్ నంబర్లు తీసుకున్నారు. క్యాంపెయిన్ టీం నుంచి మరికొన్ని నెంబర్లు తీసుకుని వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశాడు.
తృణమూల్ కారణంగా స్మార్ట్ క్యాంపెయిన్
బెంగాల్లో తృణమూల్ అరాచకాలను తట్టుకుని ప్రచారం చేయడం సవాల్తో కూడిన వ్యవహారం. అందుకే దీపక్ సోషల్ మీడియాను ఆశ్రయించారు. దీపక్ తన వద్ద ఉన్న రెండు ఫోన్ నెంబర్లలో ఒక దాని నుంచి 229 గ్రూపులకు, మరో నెంబర్ నుంచి 885 గ్రూపులకు అడ్మిన్గా ఉన్నారు. ఒక్కో గ్రూపులో 30 నుంచి 250 మంది ఉంటారు. ఉదయం ఆరు గంటల నుంచి దీపక్ వాట్సప్ గ్రూపుల్లో బిజీగా ఉంటారు.
ఫార్మసీలో పనిచేస్తున్న దీపక్
పన్నెండో తరగతి వరకు చదువుకున్నదీపక్కు గోపాల్పూర్ ప్రాంతంలో చిన్న ఫార్మసీ ఉంది. దీపక్కు భార్య, పాప ఉన్నారు. మోడీపై అభిమానంతో 2014లో బీజేపీలో చేరిన ఆయన.. ఆ మరుసటి ఏడాది ఆండ్రాయిడ్ ఫోన్ కొని సోషల్ మీడియాలో బీజేపీ తరఫున ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం కూచ్ బెహార్లో దీపక్ ఆధ్వర్యంలో 40మందితో కూడిన టీం పనిచేస్తోంది.