బీజేపీతో జేజేపీ డీల్, డిప్యూటీ సీఎం, రెండు క్యాబినెట్ బెర్తులు, శనివారం గవర్నర్ వద్దకు..
కాకరేపిన హర్యానా రాజకీయాలకు తెరపడింది. అటు తిరిగి, ఇటు తిరిగి జేజేపీ.. బీజీపీ పక్షాన చేరింది. దీంతో కమల దళం హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం మరింత సులువైంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
నో మెజార్టీ..
హర్యానాలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించాయి. తొలుత జేజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే ఇండిపెండెంట్లు అడ్డం తిరగడంతో ఆ పార్టీ పప్పులు ఉడకలేదు. బీజేపీ ఎంపీ సునీత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లడంతో.. హర్యానాలో కమల వికాసం ఖాయమని తేలిపోయింది. బీజేపీ 40 సీట్లలో విజయం సాధించగా.. ఇండిపెండెంట్లు మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు లాంఛనమే అయ్యింది.
అంతలోనే ఇలా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో సమానదూరం పాటిస్తామని చిలుక పలుకులు పలికిన జేజేపీ చీఫ్ దుష్యంత్.. శుక్రవారం రాత్రి మనసు మారింది. తాము బీజేపీతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా జేజేపీకి డిప్యూటీ సీఎం సహా మరొ రెండు క్యాబినెట్ బెర్తులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. దుష్యంత్ డిప్యూటీ సీఎం కానుండగా మరో ఇద్దరు మంత్రి పదవీ వరించనుంది. బీజేపీ జేజేపీ సభ్యులు కలిసి శనివారం గవర్నర్ను కలుస్తారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే బలం ఉందని చెబుతారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం కొలువుదీరనుంది.
ఇండిపెండెంట్ల మద్దతు కూడా
బీజేపీకి జేజేపీ సహా ఏడుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉంది. వీరిలో కొందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. జేజేపీ తమతో కలవక ముందు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో.. ఇఛ్చిన మాట మేరకు క్యాబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది. హర్యానాలో మరో ఐదేళ్లు బీజేపీ జేజేపీ కూటమి కలిసి పనిచేస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవీ చేపడుతారు. మరో ఐదేళ్లపాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని ఖట్టర్ మీడియాతో చెప్పారు.
నాటకీయ పరిణామాలు
గురువారం రాత్రి నుంచి హర్యానా రాజకీయ పరిణామాలు చకాచకా మారిపోయాయి. ఇండిపెండెట్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీ సునీత తీసుకురావడంతో.. హర్యానాలో బీజేపీ సర్కార్ ఖాయమనే అభిప్రాయం వచ్చింది. మరోవైపు జేజేపీ నేత దుష్యంత్ కూడా బీజేపీతో జతకట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాత్రి పొద్దుపోయాక అమిత్ షా నివాసంలో చర్చలు జరిపారు. మూడు క్యాబినెట్ పోస్టులు ఇచ్చేందుకు అంగీకారం కుదరడంతో ప్రభుత్వంలో చేరతామని స్పష్టంచేశారు.