బీజేపీ బ్లాక్ డే, సీఎంకు వారం టైం: కర్ణాటక బంద్, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప ఆహ్వానం!
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న మే 23వ తేదీని బీజేపీ బ్లాక్ డేగా ప్రకటించింది. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హెచ్.డి. కుమారస్వామి మీద మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప విరుచుకుపడ్డారు. వారంలోపు రైతుల రుణమాఫి చెయ్యకపోతే కర్ణాటక బంద్ కు పిలుపు ఇస్తామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు. ఇదే సమయంలో బీఎస్. యడ్యూరప్ప మాజీ ముఖ్యంత్రి సిద్దరామయ్య మీద సానుభూతి చూపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
బ్లాక్ డే, బీజేపీ ధర్నా
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన మే 23వ తేదీ చీకటి రోజు (బ్లాక్ డే) అంటూ బీజేపీ నాయకులు బెంగళూరు నగరంలోని మౌర్య సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. బీజేపీ ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన బీఎస్. యడ్యూరప్ప హెచ్.డి. కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు.
24 గంటల్లో రుణమాఫి
శాసన సభ ఎన్నికలకు ముందు నేను ముఖ్యమంత్రిని అయితే 24 గంటల్లో రైతుల రుణమాఫి చేస్తానని కుమారస్వామి హామీ ఇచ్చారని బీఎస్ యడ్యూరప్ప గుర్తు చేశారు. అదే కుమారస్వామి దేవాలయాలకు భేటీ అయిన సమయంలో రైతుల రుణమాఫి చెయ్యడం చాలకష్టమైన పని అని, ఈ విషయంలో ఆలోచించాలని చెప్పడం సిగ్గుచేటు అని బీఎస్. యడ్యూరప్ప విమర్శించారు.
Recommended Video
కాంగ్రెస్ లో సిద్దూకు విలువ లేదు
కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కాంగ్రెస్ హైకమాండ్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పట్టించుకోవడం లేదని యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మీరు సిద్దరామయ్యను ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇలా చేస్తే కురబ కులస్తులు ఎంత ఆవేదన చెందుతారో మీకు తెలుసా అంటూ బీఎస్. యడ్యూరప్ప సోనియా గాంధీని సూటిగా ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి మొదలైయ్యిందని తమకు సమాచారం ఉందని యడ్యూరప్ప అన్నారు. అసమ్మతి కాంగ్రెస్ శాసన సభ్యులు అందరూ బీజేపీలో చేరాలని తాను ఆహ్వానిస్తున్నానని ధర్నాలోనే బీఎస్. యడ్యూరప్ప బహిరంగంగా చెప్పారు.
స్వార్థరాజకీయాలు
నిన్నటి వరకు భద్దశత్రువులుగా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు నేడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వార్థరాజకీయాలకు తెరలేపారని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ లోని అసమ్మతి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని, తరువాత మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని బీఎస్. యడ్యూరప్ప బహిరంగంగా పిలుపునిచ్చారు.
మోడీకి బహుమానం
కాంగ్రెస్-జేడీఎస్ కళ్లు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి బండారం బయటపెడుతామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని మోడీకి బహుమతిగా ఇస్తామని బీఎస్. యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చాలెంజ్ చేశారు.