బీహార్: మాట నిలబెట్టుకున్న బీజేపీ -ఉచితంగా వ్యాక్సిన్లకు నితిశ్ కేబినెట్ ఆమోదం -19లక్షల ఉద్యోగాలపైనా
బీహార్ లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-జేడీయూ కూటమి.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్ధాలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది రోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన వాగ్ధానాలైన 'ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ', '19 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు' హామీలపై రాష్ట్ర కేబినెట్ కీలక అడుగులు వేసింది..
Recommended Video
రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందన
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో మంగళవారం పాట్నాలో బీహార్ కేబినెట్ సమావేశం జరిగింది. బీహార్ లో అవసరమైన అందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలనే నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంకో రెండు మూడు వారాల్లోనే ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..
బీహార్ లోనూ వ్యాక్సిన్ పంపిణీపై దృష్టిసారించిన నితీశ్ సర్కారు.. టీకాలను ఉచితంగా ఇస్తామన్న బీజేపీ హామీని కార్యరూపంలోకి తీసుకొస్తున్నది. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామన్న నాలుగో రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రజల నుంచి డబ్బులు తీసుకోబోమని తెలిపాయి. ఇదిలా ఉంటే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన మరో కీలక వాగ్ధానం.. 19 లక్షల ఉద్యోగాలు. తొలుత అచ్చంగా అవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలేనని ప్రచారం జరిగినా.. ఎన్నికల సమయంలోనే బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు రంగంలో, సొంత వ్యాపారాలతో యువకులకు ఉపాధి కల్పిస్తామని చెప్పింది. ఆ దిశగా 'సాత్ నిశ్చయ్ -పార్ట్ 2' అమలుపైనా ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో చర్చించారు. త్వరలోనే ఉద్యోగ, ఉపాధి కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.