ఉత్తరాఖండ్లోనూ మోదీ సునామీ: కౌన్ బనేగా సిఎం?
కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తోపాటు దాని పొరుగున పర్వతాల మధ్య గల ఉత్తరాఖండ్లోనూ ప్రధాని నరేంద్రమోదీ పట్ల ఓటర్ల అభిమాన ‘సునామీ’ ఎగసిపడుతోంది. ఉత్తరాఖండ్ ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చ
న్యూఢిల్లీ/ డెహ్రాడూన్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్లోనూ ఘన విజయం సాధన దిశగా బీజేపీ దూసుకెళుతున్నది. ప్రధాని నరేంద్రమోదీ పట్ల ఓటర్ల అభిమాన 'సునామీ' ఎగసిపడుతున్నది. పర్వతాల మధ్య, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన హరీశ్ రావత్ నేత్రుత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కానవచ్చింది.
దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విస్త్రుత స్థాయిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనడం బీజేపీకి కలిసి వచ్చింది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, ఆ పార్టీ నుంచి మాజీ సీఎం విజయ్ బహుగుణ సారథ్యంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం హస్తవాసి క్షీణించిపోవడానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
గత ఏడాది బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సమయంలో మూజువాణి ఓటుతో ఆర్థిక బిల్లు ఆమోదానికి నిరాకరించడంతో తలెత్తిన వివాదం సుప్రీంకోర్టు ఆదేశంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు దారి తీసింది. కానీ అప్పటికే రావత్ పట్ల ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఆయన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు చేసిన ప్రయత్నంపై తీసిన వీడియో క్లిప్పింగ్ లను ప్రచారంలో పెట్టడంలో కమలనాథులకు కలిసి వచ్చినట్లు తెలుస్తున్నది.
ఈ తరుణంలో వచ్చే ఐదేళ్ల పాటు సుస్థిరమైన పాలన అందించగల నాయకుడ్ని ఎంచుకోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వంపై ఉన్నది. ఆ పార్టీలో సీనియర్ నేతలకు కొదవలేదు. గత 13 ఏళ్లలోనే పలువురు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీలు తమకు అవకాశం వచ్చిన ప్రతీసారీ సీఎంలను తప్పించిన ఘటనలు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ప్రయోగాన్ని ఉత్తరాఖండ్ వాసులు అంగీకరించరని హరీశ్ రావత్ ప్రభుత్వ ఓటమి తెలియజేస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్ల పాటు సీఎం పదవి ఆశిస్తున్న నేతలు పలువురు ఉన్నారు. వారి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..
సీనియర్ మోస్ట్ బీసీ ఖండూరీ
ఇంతకుముందే బీజేపీ తరఫున సీఎంగా పని చేసిన బీసీ ఖండూరీ 2012 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమయ్యారు. ఆయన అవినీతి రహితుడన్న క్లీన్ ఇమేజ్ కూడా ఉన్నది. అయితే 2012 ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమన్న అపవాదు కూడా ఖండూరీ మోస్తున్నారు. 82 ఏళ్ల వయస్సు గల ఖండూరీ ఎక్కువ కాలం సీఎంగా పనిచేసేందుకు వయస్సు అనుమతించే అవకాశాలు లేవు. కానీ ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేతల్లో అందుబాటులో ఉన్న వారిలో బీసీ ఖండూరీ మాత్రమే బెస్ట్ చాయిస్ అని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.
ఉత్తరాఖండ్ బీజేపీలో కీలక నేతగా అవతరించిన బహుగుణ
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న విజయ్ బహుగుణ 2016లో హరీశ్ రావత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురేశారు. విజయ్ బహుగుణ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. కానీ బీజేపీలో చేరిన తర్వాత సీఎం పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. 2013లో వరదల నివారణ, సహాయ పునరావాస చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. విజయ్ బహుగుణను సీఎంగా పక్కకు తప్పించి హరీశ్ రావత్కు సీఎంగా పగ్గాలు అప్పగించింది. దీన్ని మనస్సులో పెట్టుకున్న విజయ్ బహుగుణ.. అవకాశం కోసం ఎదురుచూసి గతేడాది తిరుగుబావుటా ఎగురేయడమే కాదు ఆయనతోపాటు బీజేపీలోకి పలువురు కాంగ్రెస్ నేతలకు తీసుకొచ్చిన ఘనత సాధించారు. అయితే 2013 వరదల తర్వాత పరిస్థితి నియంత్రించడంలో విఫలమైన నేత అని బీజేపీ అప్పట్లో విజయ్ బహుగుణపై విమర్శల వర్షం కురిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత అదే బీజేపీలో కీలక పాత్రధారుడిగా విజయ్ బహుగుణ మారారు.
పొఖ్రియాల్ అవకాశాలివి..
ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎంగా పనిచేసిన రమేశ్ పొఖ్రియాల్ తాజాగా సీఎం పీఠమెక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2009 - 11 మధ్య కాలంలో సీఎంగా ఉన్న ఆయన ప్రభుత్వంపై లెక్కలేనని అవినీతి కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పొఖ్రియాల్ కు సొంత నియోజకవర్గంలో ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్నా.. ఆయనపై ఉన్న కళంకిత ముద్ర కారణంగా బీజేపీ నాయకత్వం పొఖ్రియాల్ ను సీఎంగా చేస్తారా? అన్న విషయం అనుమానమే.
విశ్వసనీయమైనా కోషియారీ వయస్సే ఆటంకం
ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా పని చేసిన భగత్ సింగ్ కోషియారీ (74) కొద్ది కాలం పాటు మాత్రమే సీఎంగా పనిచేశారు. 2001 అక్టోబర్ నుంచి 2002 మార్చి వరకు సీఎంగా ఉన్న కోషియారీ ప్రస్తుతం పార్టీలో విశ్వసనీయమైన నేతగా ఉన్నారు. బీసీ ఖండూరీ మాదిరిగానే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన వయస్సు ఆటంకంగా పరిణమిస్తోంది.
అహంకారానికి దూరంగా అజయ్
రద్దయిపోతున్న అసెంబ్లీలో విపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అజయ్ భట్ .. పార్టీలో యువ నాయకుడు. ఇతర సీనియర్ నేతల అహంకారాలను పట్టించుకోకుండా వారందరితోనూ వ్యూహాత్మకంగా కలిసిపోతూ పార్టీ ప్రతిష్ఠ మెరుగుపర్చడంలో అజయ్ భట్ దిట్ట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో అసంత్రుప్తి ఉన్నా వారికి నచ్చచెప్పడంలో కీలక భూమిక పోషించారు. పార్టీ విజయానికి అహర్నిశలు పనిచేసిన నేత అన్న పేరు సంపాదించుకున్నారు.