లోక్సభ ప్రొటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్?
ఢిల్లీ : మోడీ నేతృత్వంలో ఎన్డీఏ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో త్వరలో లోక్సభ కొలువుదీరనుంది. 17వ లోక్సభ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీని ప్రొటెం స్పీకర్గా నియమించే అవకాశముందన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ పదవి కోసం బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది.
17వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా వీరెంద్రకుమార్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి మోడీ 2.0 కేబినెట్లో చోటు దక్కని మేనకా గాంధీకి ఆ బాధ్యతలు అప్పగిస్తారని, ఆ తర్వాత ఆమెనే స్పీకర్గా ఎన్నుకుంటారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ చివరి నిమిషంలో వీరేంద్రకుమార్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
దళిత నేత అయిన వీరేంద్రకుమార్ మధ్యప్రదేశ్ తికమ్గఢ్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. ఏబీవీపీ కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1977-79 మధ్య కాలంలో ఏబీవీపీ కన్వినర్గా పని చేసిన వీరేంద్ర కుమార్.. గత ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ శాఖ సహాయమంత్రిగా వ్యవహరించారు. అయితే ఈసారి కేబినెట్లో వీరంద్రకు కూడా చోటు దక్కలేదు. దీంతో ఆయనను ప్రొటెం స్పీకర్గా నియమించి కొత్త స్పీకర్ ఎన్నిక చేపట్టాలని మోడీ సర్కారు భావిస్తోంది.
లోక్సభ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రొటెం స్పీకర్తో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది. లోక్సభ స్పీకర్ రేసులో మేనకాగాంధీ, రాధామోహన్ సింగ్, అహ్లూవాలియా, జవెల్ ఓరం పేర్లు వినిపిస్తున్నాయి.