ఈ ఎమ్మెల్యే మహిళలకు ఇచ్చే సలహా ఏంటో తెలిస్తే ఛీ అంటారు
మధ్యప్రదేశ్: బీజేపీ నేతలు రోజురోజుకీ నోరు జారి విమర్శల పాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంస్కారహీనులైన పిల్లలకు జన్మనివ్వడం కంటే పిల్లలు కనకుండా ఉండటమే ఉత్తమం అంటూ పన్నాలాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అనే నినాదం తీసుకొచ్చింది కానీ... పేదరికాన్ని నిర్మూలించకుండా పేదలను నిర్మూలిస్తోందంటూ పన్నాలాల్ ధ్వజమెత్తారు. ఇలాంటి నాయకులకు జన్మనిచ్చిన కొందరు మహిళలు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంస్కారహీనులైన నేతలకు, సమాజాన్ని పక్కదోవ పట్టించే నాయకులకు ఇలాంటి మహిళలు జన్మనివ్వడంకంటే... పిల్లలను కనడం మానేయడం ఉత్తమం అని చెప్పుకొచ్చారు.
పన్నాలాల్ శాక్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. ఓ సందర్భంలో అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ను చేసుకోవడం అనే అంశంపై మాట్లాడుతూ ...పాశ్చాత్య పోకడలను అబ్బాయిలు అలవరచుకోరాదని చెప్పారు. అదే సమయంలో అమ్మాయిలు కూడా అబ్బాయిల వెనక పడటం మానేయాలని క్లాస్ తీసుకుంటూ... ఇదే జరిగితే అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగిపోతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పన్నాలాల్. రాముడు, కృష్ణుడు, యుదిష్టిరుడు లాంటి వారు భారతదేశంలోనే వివాహం చేసుకున్నారని గుర్తు చేస్తూ... విరాట్ కోహ్లీ మాత్రం పరదేశంలో పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కోహ్లీకి భారత్లోనే డబ్బు పేరు సంపాదించాడని... పెళ్లి మాత్రం పరాయి దేశంలో చేసుకున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద భారతదేశంలో కోహ్లీకి వివాహం చేసుకునేందుకు మరో స్థలమే దొరకలేదా అంటూ పన్నాలాల్ ప్రశ్నించారు. కోహ్లీకి దేశం పట్ల భక్తి లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.