రాహుల్ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు!
భోపాల్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నదీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తానని మధ్యప్రదేశ్కి చెందిన ఓ బిజెపి నాయకుడు ప్రకటించారు. ఇటీవలే 46వ ఏట అడుగుపెట్టిన రాహుల్ కొద్ది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు.
అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు? ఏ దేశంలో ఉన్నారన్న విషయం గోప్యంగా ఉంచారు. రాహుల్ గాంధీ పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ సిసోడియా ఒకడుగు ముందుకేసి రాహుల్ సమాచారం తెలిపితే అక్షరాల లక్షరూపాయలు రివార్డుగా ఇస్తానని ప్రకటించారు.
మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ చైర్మన్గా ఉన్న సిసోడియా'రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి. నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను' అని చెప్పారు.
కొద్ది నెలల క్రితం రాహుల్ గాంధీ జరిపిన విదేశీ పర్యటనపైనా సెటైర్లు వేశారు. ఆయన తిరిగి స్వదేశం వచ్చేవరకూ ఏ దేశం వెళ్లింది తెలియకుండా రహస్యంగా ఉంచారనీ, అప్పట్లో ఆయన థాయ్లాండ్, మలేసియా, బ్యాంకాక్, సింగపూర్లో తిరిగి వచ్చారని ఆయన తెలిపారు.
Traveling out of the country for a few days on a short visit.Thanks again to all who met &wished me y'day,truly grateful for your affection!
— Office of RG (@OfficeOfRG) June 20, 2016
కాగా, కాంగ్రెస్ పార్టీ నేత రవి సక్సేనా వెంటనే ఈ బిజెపి నేత రివార్డుకు కౌంటర్ ఇచ్చారు. బిజెపికి రాహుల్ ఫోబియా పట్టుకుందని అన్నారు. హోంమంత్రిత్వ శాఖను అడిగితే రాహుల్ ఆచూకీ తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని కారణంగానే సిసోడియా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.