ప్రభుత్వానికి సినిమా చూపిస్తున్న అసంతృప్తి ఎమ్మెల్యేతో, బీజేపీ లీడర్స్ భేటీ !
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు కంటి మీదకునుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అంటూ ఒంటికాలి మీద నిలబడిన మాజీ మంత్రి, ఆపార్టీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి అనుకున్నదంతా చేసే పనిలో నిమగ్నం అయ్యారని సమాచారం. తాజాగా బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో రమేష్ జారకిహోళి భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉలిక్కిపడ్డారు.
నేతలతో చర్చలు
యమకనమరడి శాసన సభ్యుడు, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి బెంగళూరు చేరుకుని సెవన్ మినిస్టర్స్ క్వాటర్స్ లో బసచేశారు. చెన్నపట్టణ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పీసీ. యోగేశ్వర్, నెలమంగల మాజీ ఎమ్మెల్యే నాగరాజ్ మంగళవారం సాయంత్రం సెవన్ హిల్స్ క్వాటర్స్ చేరుకుని రాత్రి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళితో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు.
రమేష్ జారకిహోళి
రమేష్ జారకిహోళి తన సొంత నియోజక వర్గంలోని బీజేపీ నాయకులతో సమావేశం అయ్యి పార్టీ మారే విషయంలో చర్చించారని సమాచారం. అయితే ఇంకా ఆ విషయంపై రమేష్ జారకిహోళి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసిన రమేష్ జారకిహోళి, బీజేపీ నాయకుల భేటీ ఇప్పుడు సంచలనం అయ్యింది. ఏ రాజకీయ పార్టీల నాయకులు కలిసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.
సిద్దరామయ్య ఆదేశం
గోకాక్ లో ఉన్న రమేష్ జారకిహోళి మాజీ సీఎం సిద్దరామయ్య పిలుపు మేరకు సోమవారం బెంగళూరు వచ్చారని సమాచారం.. అయితే మాజీ సీఎం సిద్దరామయ్య, రమేష్ జారకిహోళి భేటీ కాలేదు. ఇదే సమయంలో మంగళవారం ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులు సీపీ. యోగేశ్వర్, నాగరాజ్ లతో రమేష్ జారకిహోళి భేటీ కావడంతో చర్చకు తెరలేసింది. చెన్నపట్టణ, రామనగర నియోజక వర్గాల్లో సీపీ. యోగేశ్వర్ కు మంచి పట్టుఉంది.
ఆపరేషన్ కమల ?
2018 డిసెంబర్ లో ఆపరేషన్ కమల తెరమీదకు వచ్చిన సమయంలో సీపీ. యోగేశ్వర్ చురుకుగా పార్టీ కార్యకలాపాల్గో నిమగ్నం అయ్యారు. సీపీ. యోగేశ్వర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని, ముంబై వెళ్లి వారితో కలిసి ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మండిపడుతున్న రమేష్ జారకిహోళితో సీపీ. యోగేశ్వర భేటీ కావడంతో ఆపరేషన్ కమల మళ్లీ తెర మీదక వచ్చింది.
ముగ్గురు మిత్రుల హవా !
మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, బళ్లారి గ్రామీణ శాసన సభ ఎమ్మెల్యే నాగేంద్ర (కాంగ్రెస్, మహేష్ కుమటళ్ళి (కాంగ్రెస్) ముగ్గురు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, వారు ఏ పార్టీలో చేరరని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మూడు రోజుల క్రితం ట్వీట్ చేసి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రమేష్ జారకిహోళి బీజేపీ నాయకులతో భేటీ అయ్యి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.