'మాయావతి వేశ్య కంటే హీనం': బీజేపీ నేత, పార్టీలో కుదుపు
లక్నో: బహుజన సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పైన బీజేపీ యూపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాశంకర్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయావతి వేశ్య కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుందని, మాయావతి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాన్షీరాం ఆశయాలను మాయావతి తుంగలో తొక్కారన్నారు.
తనకు ఎవరు రూ.కోటి ఇస్తే వారికి మాయావతి టిక్కెట్ ఇస్తారని భగ్గుమన్నారు. మధ్యాహ్నం ఎవరైనా వచ్చి రూ.2 కోట్లు ఇస్తే అదే నియోజకవర్గం టిక్కెట్ వారికి ఇస్తారని, సాయంత్రం రూ.3 కోట్లు ఇస్తే, వారికి కూడా టిక్కెట్ ఇస్తారని ఆరోపించారు. ఆమె తీరు వ్యభిచారిణి కంటే దారుణంగా ఉందన్నారు.
ఆయన వ్యాఖ్యల పైన బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. దయాశంకర్.. మాయావతి పైన చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఆయన క్షమాఫణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు.
అరెస్ట్ చేయండి
తన పైన చేసిన వ్యాఖ్యలకు దయాశంకర్ సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. తనను ప్రజలు సోదరి అని పిలుస్తారని, అలాంటి తనను ఆయన అవమానించారన్నారు. అతను తనను అవమానించినట్లు కాదని ఆయన కూతురును, సోదరిని అవమానించినట్లే అన్నారు. ప్రజలు బీజేపీని క్షమించరన్నారు.
కాగా, దయాశంకర్ సింగ్ వ్యాఖ్యల పైన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ క్షమాపణలు చెప్పారు. 'నేను వ్యక్తిగతంగా క్షమాపణ కోరుతున్నాను. మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను' అని జైట్లీ వ్యాఖ్యానించారు.పార్లమెంటు సాక్షిగా బాధపడిన మాయావతికి అందరూ అండగా నిలిచారు. జైట్లీ సహా అందరూ ఆమెకు మద్దతు పలికారు.
నోరు జారాను, క్షమించండి: దయాశంకర్
మాయావతి పైన తాను చేసిన అభ్యంతర వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగడంతో దయశంకర్ తగ్గారు. తాను నోరు జారానని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. ఇక నుంచి మాట్లాడేటప్పుడు ఆచితూచి స్పందిస్తానని చెప్పారు.
దయాశంకర్ సింగ్ పైన వేటు
మాయావతి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన దయశంకర్ సింగ్ పైన బీజేపీ వేటు వేసింది. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన వ్యాఖ్యలు, ఆయన పైన వేటు.. బీజేపీకి పెద్ద కుదుపు అని చెప్పవచ్చు.
మాయావతి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పైన చర్యలు తీసుకోకుంటే దళితులు అంటే బీజేపీకి చిన్న చూపు అనే ఆరోపణలు వచ్చే అవకాశముంది. ఈ కారణంగా ఆయన పైన వేటు వేసినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం రంగంలోకి దిగి ఆయన పైన చర్యలు తీసుకుంది. ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ యూపీ అధ్యక్షులు మౌర్య ప్రకటించారు. అయితే, ఇది బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.