దావూద్ వచ్చినా...: షారూక్పై బిజెపి నేత సంచలన వ్యాఖ్య
షారూక్ ఖాన్పై బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. రయీస్ ప్రమోషన్ సమయంలో జరిగిన ఉదంతంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.
ముంబై: బాలీవుడ్ 'బాద్షా' షారూఖ్ ఖాన్పై బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా షారూఖ్పై విరుచుకుపడుతున్న ఆయన తాజాగా షారూక్ ఖాన్ను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు.
షారూఖ్ తన తాజా చిత్రం 'రయీస్' ప్రమోషన్లో భాగంగా మంగళవారం షారూఖ్ ముంబై నుంచి ఢిల్లీ వరకు రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వడోదరలోని రైల్వే స్టేషన్లో షారూఖ్ను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి, ఓ అభిమాని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
ఆ సంఘటనపై స్పందించిన భారతీయ జనతాపార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ షారూఖ్ను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. దావూద్ ఇబ్రహీం వీధుల్లోకి వచ్చినా జనాలు ఇలాగే చూసేందుకు ఎగబడతారని, అంతామాత్రాన అది తన పాపులారిటీ అనుకుంటే తప్పేనని ఆయన అన్నారు. పైగా ఇంతకుమించి తాను మాట్లాడనని, దీనిర్థం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోగలరని షారూఖ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గతంలోనూ షారూఖ్కు వ్యతిరేకంగా కైలాశ్ ట్విట్టర్లో పోస్టులు చేశారు. 'రయీస్'ను వ్యతిరేకిస్తూ హృతిక్ రోషన్ సినిమా 'కాబిల్'కు మద్దతు ఇస్తూ పోస్టు చేశారు. ఈ రెండు సినిమాలు రేపు(బుధవారం) విడుదల కానున్నాయి. కైలాశ్ వ్యాఖ్యలపై షారూఖ్ అభిమానులు మండిపడుతున్నారు.