ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులు
ఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసనకారులు రాష్ట్ర కార్యాలయానికి తాళం వేశారు. బీజేపీ నాయకుడు అమియా దాష్కు సంబంధించిన వర్గీయులు ఆయనకు టికెట్ రాలేదన్న ఆగ్రహంతో భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయం మెయిన్ గేట్కు తాళం వేశారు. ఆ తర్వాత వారంతా గేటు ముందర బైఠాయించి ధర్నాకు దిగారు. 99 అసెంబ్లీ స్థానాలున్న ఒడిషాకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో అమియా దాష్ కనిపించకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఏకమ్రా-భువనేశ్వర్ స్థానంను బీజేడీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన బాబుసింగ్కు టికెట్ కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి దాష్ 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. నిరసనకారులు బాబుసింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాష్కు టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో సీనియర్ బీజేపీ నాయకులు వచ్చి వారిని సముదాయించడంతో మెత్తబడి గేట్లకు తాళం తెరిచారు.
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారం
ఇక కోరాపుట్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.లక్ష్మీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేడీ నుంచి బీజేపీకి వచ్చిన కుముద్ సాంతకు టికెట్ ఇవ్వడంతో స్థానిక నేత వర్గీయులు జిల్లా బీజేపీ కార్యాలయంపై దాడులు చేశారు. మరోవైపు జాజ్పూర్ జిల్లాలో బడాచనా నియోజకవర్గం, భద్రక్ జిల్లాలోని బసుదేవ్పూర్లలో కూడా బీజేపీ అభ్యర్థులకు టికెట్ దక్కకపోవడంతో వారి అనుచరులు కార్యాలయాలపై దాడులు చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు.