అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణం: ప్రధాని మోడీ అభినందనలు
గౌహతి: అస్సాం రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. బిశ్వశర్మతోపాటు 13 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, నాగాలాండ్ సీఎం నేపియా రియో, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వనాంద సోనోవాల్, బీజేపీ శాసనసభ్యులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు హాజరయ్యారు.
గౌహతిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే నేతలు హాజరయ్యారు. బీజేపీ భాగస్వామ్య పార్టీ యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అధినేత ఉర్ఖవో గ్వర బ్రహ్మ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు. కాగా, అస్సాం సీఎంగా హిమంతను ఎన్నుకుంటూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈశాన్య భారతదేశంలో సంక్షోభాల పరిష్కార కర్తగా, డైనమిక్ లీడర్గా హిమంత బిశ్వశర్మకు పేరుంది.
Himanta Biswa Sarma takes oath as the Chief Minister of Assam. He is being administered the oath by Governor Jagdish Mukhi. BJP national president JP Nadda and other leaders present at the ceremony. pic.twitter.com/1bZQVPlWsd
— ANI (@ANI) May 10, 2021
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంలో బిశ్వశర్మ కీలక పాత్ర పోషించారు. అన్నీతానై ముందుకు ప్రజలను బీజేపీ వైపు తిప్పారు. బోడోలాండ్ ప్రాంతంలో బీజేపీ కాలు పెట్టేలా చేసి కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఎన్నికలకు ముందు ఏడాదిపాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో జాతీయ స్థాయిలో ఆయనకు ప్రశంసలు అందడం గమనార్హం.
Congratulations to @himantabiswa Ji and the other Ministers who took oath today. I am confident this team will add momentum to the development journey of Assam and fulfil aspirations of the people.
— Narendra Modi (@narendramodi) May 10, 2021
126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో బీజేపీ 60 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలు అస్సాం గణపరిషత్కు 9, యూపీపీఎల్కు 6 సీట్లు వచ్చాయి. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన శర్బానంద సోనోవాల్ను తిరిగి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.