పేట్రేగిన ఉగ్రవాదులు: బీజేపీ నేత, తండ్రి, సోదరుడి కాల్చివేత: 10 మంది పోలీసులు అరెస్ట్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లతో టెర్రరిస్టులను ఏరి పారేస్తోన్న సమయంలో వారు.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఆయన తండ్రి, సోదరుడిని కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లోని బండీపురాలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సహా పలువురు నేతలు సంతాపాన్ని తెలిపారు.
Shocked and saddened by d killing of young BJP leader Wasim Bari and his brother by terrorists in Bandipora. Bari’s father who is also a senior leader was injured. This despite 8 security commandos. Condolences to d family. pic.twitter.com/hAKnOudaxj
— Ram Madhav (@rammadhavbjp) July 8, 2020
బండీపురా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు వసీం బారీ, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, ఉమర్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బండీపురాలోని తన షాపులో ముగ్గురూ ఉన్న సమయంలో బైక్పై వచ్చిన ఉగ్రవాదులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సైలెన్సర్ అమర్చిన తుపాకీని వారు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో 10 పోలీసులు అరెస్టు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వసీం బారికి రక్షణ కల్పించాల్సిన విషయంలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వారిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వసీం బారి కుటుంబ సభ్యులతో టెలిఫోన్లో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో వసీం బారి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు.
Over the telephone, PM @narendramodi enquired about the gruesome killing of Wasim Bari. He also extended condolences to the family of Wasim.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 8, 2020
కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేత పతాక స్థాయిలో కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నాయకుడు, ఆయన కుటుంబాన్ని టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు ప్రతీకార చర్యకు దిగారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన అనంతరం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు బండిపూరా జిల్లాలో విస్తృత సోదాలను నిర్వహించారు.