కాంగ్రెస్ తో బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. రివర్స్ గేర్ వేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి !
బెంగళూరు: కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, ఆ మాట వాస్తవమని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత కేఎస్. ఈశ్వరప్ప అన్నారు. కలబురిగి జిల్లా చించోళి ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీలోకి ఆహ్వానించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారని ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.సంకీర్ణ ప్రభుత్వం మీద అసహనంతో ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఈశ్వరప్ప అన్నారు.
త్వరలో కర్ణాటక రాజకీయాల్లో పలుమార్పులు జరుగుతాయని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని ఈశ్వరప్ప అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెబుతున్న నాయకులు వారి పేర్లు బయట పెట్టాలని, అప్పుడు తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు బయటపెడుతామని ఈశ్వరప్ప అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం మీద అసహనంతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని, అందులో ఎలాంటి సందేహం లేదని ఈశ్వరప్ప అన్నారు.