ఇదే చైతన్యం కోల్పోవడమంటే: దీపికా ‘మై చాయిస్’పై జోషి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో రూపొందించిన ‘మై చాయిస్' వీడియోపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి స్పందించారు. ఆ వీడియోలో తీవ్రస్థాయిలో చైతన్యం(స్పృహ) లోపించిందని ఆయన పేర్కొన్నారు.
‘మనమెంత మార్పు చెందామో తెలుసుకోవడం లేదు. మహిళ అంటే తల్లి అని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కానీ, ఇప్పుడు తల్లి అని పిలవడానికి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి' అని కోల్కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జోషీ అన్నారు.
‘తాను ప్రతి చోట ఉండాలనుకున్న దేవుడు తల్లిని సృష్టించాడు. కానీ అది పాతతరం భావనగా మారింది. ఇప్పుడు నాకో చాయిస్ ఉంది అంటున్నారు. ప్రస్తుతం మనం ‘మై చాయిస్'(దీపికా పదుకొనె వీడియో) ఉంది చూస్తున్నాం. ఇప్పుడు మీరొక శరీరం, ఒక వస్తువు. ఇదే చైతన్యం కోల్పోవడం అంటే' అని జోషీ స్పష్టం చేశారు.
ప్రస్తుత కాలంలో ప్రజలు పాశ్చాత్య దేశాల సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తూ, దాని ద్వారా గుర్తింపు పొందాలనుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో మన సంప్రదాయాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతున్నామని అభిప్రాయపడ్డారు.
మహిళా సాధికారత కోసమని హోమి అదజానియా దర్శకత్వంలో దీపికా పదుకొనె ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘మై చాయిస్' అనే ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు.