ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నాయకుడి దారుణ హత్య: భార్యకు ఫోన్ చేసి హంతకుల పేర్లు చెప్పి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నాయకుడిని అతిదారుణంగా హత్య చేశారు. బాద్ శాహా నగరలో నివాసం ఉంటున్న ప్రత్యుష్ మణి త్రిపాఠి (34) అనే వ్యక్తి హత్యకు గురైనాడని పోలీసులు మంగళవారం చెప్పారు. హంతకుల వివరాలు తెలిశాయని, త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
సోమవారం రాత్రి ప్రత్యుష్ మణి త్రిపాఠి వెలుతున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రగాయాలైన ప్రతుష్ మణి త్రిపాఠి నడిరోడ్డులో కుప్పకూలిపోయాడు. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి ప్రతుష్ మణి త్రిపాఠిని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకుని వివరాలు సేకరించారు. చికిత్స విఫలమై మంగళవారం ప్రతుష్ మణి త్రిపాఠి మరణించాడని వైద్యులు తెలిపారు. పక్కా స్కెచ్ తో బీజేపీ నాయకుడు ప్రతుష్ త్రిపాఠిని హత్య చేశారని పోలీసులు అంటున్నారు.
ప్రత్యర్థులు దాడి చేసిన సమయంలో ప్రతుష్ మణి త్రిపాఠికి తీవ్రగాయలైనాయని, ఆ సందర్బంలో అతను భార్యకు ఫోన్ చేసి తన మీద దాడి చేసింది ఎవరు, వారి పేర్లుతో పాటు పూర్తి సమాచారం ఇచ్చాడని పోలీసులు అంటున్నారు. అయితే విచారణ జరుగుతున్నందున హంతకుల పేర్తు, వివరాలు బయటకు చెప్పడం వీలుకాదని పోలీసులు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అలర్లలో భాగమైన వారే ప్రతుష్ మణి త్రిపాఠిని హత్య చేసి ఉంటారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రతుష్ మణి త్రిపాఠి హత్యను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బాద్ శాహా ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.