‘లవ్ జిహాద్’ కేరాఫ్ హుక్కా సెంటర్లు: తన కూతురూ బాధితురాలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ నేత
భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ నరగానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ ఆరోపించారు. ఆయన కారణంగానే తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో తనకు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సురేంద్రనాథ్ కూతురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉంటున్నానని, తన కుటుంబసభ్యులకు ఇది ఇష్టం లేదని ఓ వీడియోలో కూడా పేర్కొంది.
హుక్కా సెంటర్లు..
ఈ క్రమంలో మంగళవారం సురేంద్ర నాథ్ మీడియాతో మాట్లాడారు. భోపాల్లో ఉన్న హుక్కా లాంజ్ యజమానులు వెంటనే వాటిని మూసివేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో వాటి భద్రతకు భంగం కలిగితే తననేమీ ప్రశ్నించకూడదని స్పష్టం చేశారు.
మా కూతురూ లవ్ జిహాద్ బాధితురాలే..
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. హుక్కా లాంజ్లు కేంద్రంగా లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారని సురేంద్రనాథ్ ఆరోపించారు. హుక్కా లాంజ్లతో మసూద్కు సంబంధం ఉందన్నారు. తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా ఈ హుక్కా లాంజ్ల కారణంగానే మారిందని అన్నారు.
సహించమంటూ హెచ్చరిక..
అసలు పిల్లలు హుక్కా లాంజ్లకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. వారికి హుక్కా తాగాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దయచేసి ఇప్పట్నుంచైనా ఆ హుక్కా సెంటర్లకు వెళ్లవద్దని కోరారు. భోపాల్లో హుక్కా సెంటర్లు కొనసాగితే మాత్రం తాము సహించమని సురేంద్రనాథ్ హెచ్చరించారు.
ప్రతీ తండ్రి లాగే నేనూ..
గత నాలుగేళ్లుగా తన కూతురు డిప్రెషన్తో బాధ పడుతోందని.. అందుకే ఆమెకు చికిత్స కూడా చేయిస్తున్నామని చెప్పారు. మానసికంగా కుంగిపోయిన తన కూతురుతో కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో ప్రతీ తండ్రి తన కూతురిని తన మతం వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడతాడని, అందుకు తానేమీ మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. తమ దేవుడిని విశ్వసిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలు పాటించే వ్యక్తికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.