బాల్యవివాహాలకు అండగా నిలుస్తానని చెప్పి అడ్డంగా బుక్కైనా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి
రాజస్థాన్ : ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు రాజకీయనాయకులు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తున్నారు. కొన్ని చట్టానికి లోబడి ఉంటే.. మరికొన్ని హామీలు చట్టపరిధిని దాటి ఉన్నాయి. తాజాగా రాజస్తాన్ రాష్ట్రంలోని సోజత్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కూడా ఇలాంటి హామీనే ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పటికే వసుంధర రాజే ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు ఉండగా ఇలాంటి నేతల వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టాన్ని తీసుకువస్తున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రం సోజత్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా తనను గెలిపిస్తే బాల్యవివాహాలను పోలీసులు అడ్డుకోకుండా చూస్తానని చెప్పారు. ఇప్పటికే వసుంధరా రాజే ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ప్రజలు ఉన్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా చౌహాన్ వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెట్టాయి. సోజత్ నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం. శోభా చౌహాన్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రాజేష్ చౌహాన్ భార్య. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది రెండో సారి. సోజత్ నియోజకవర్గంలోని పీపలియా కాలా ప్రాంతంలో స్నేహ సమ్మేళనంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శోభా చౌహాన్ స్నేహ సమ్మేళనంలో ప్రసంగిస్తుండగా ఆమె వద్దకు బాల్యవివాహాల ప్రస్తావన వచ్చింది. అక్కడి దేవసి సామాజిక వర్గానికి చెందిన వారు బాల్యవివాహాలు జరుపుతుంటారని... అయితే తరచూ పోలీసులు అడ్డుకుంటున్నారని శోభా చౌహాన్ దృష్టికి తీసుకురావడంతో ఆమెను గెలిపిస్తే పోలీసులు అడ్డుకోకుండా చూస్తానంటు వ్యాఖ్యానించింది. తమకు అధికారం ఉంటుందని... రాష్ట్ర ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పిన శోభా చౌహాన్... బాల్యవివాహాలను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోకుండా చూస్తామన్నారు. ఆమె చెప్పిన మాటలు ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను జిల్లా కలెక్టర్ ఈసీకి పంపించారు. విచారణ చేసిన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిందిగా శోభాకు నోటీసులు జారీ చేసింది.