బీజేపీ నేత కొడుకు కిడ్నాప్: రూ. కోటి డిమాండ్
గువహాటి: ఉల్ఫా తీవ్రవాదులు అసోంలో బీజేపీ నేత కుమారుడిని కిడ్నాప్ చేశారు. అతనిని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని తీవ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు.
టిన్ సుకియా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రత్నేశ్వర్ మోరన్ కొడుకు కుల్దీప్ మోరన్ ను ఈనెల మొదటి వారంలో కిడ్నాప్ చేశారు. కుల్దీప్ ను విడిచిపెట్టాలంటే రూ. ఒక కోటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రత్నేశ్వర్ మోరన్ సమీప బంధువు, బీజేపీ శాసన సభ్యుడు బొలిన్ చెటియా దగ్గర ఆ నగదు తీసుకోవాలని తీవ్రవాదులు సూచించారు. అయితే మొదట కుల్దీప్ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ విషయాన్నితేలిగ్గా తీసుకున్నారు.
ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులు విడుదల చేసిన వీడియో చూసి హడలిపోయారు. తనను ఎలాగైనా విడిపించాలని కిడ్నాప్ అయిన కుల్దీప్ మోరన్ తన కుటుంబ సభ్యులకు, ముఖ్యమంత్రి సోనోవాల్ కు మనవి చేశాడు.
ఈ వీడియో చూసిన తరువాత కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు షాక్ కు గురైనారు. కుల్దీప్ మోరన్ చుట్టు ఐదు మంది తీవ్రవాదులు ముఖానికి ముసుగులు వేసుకుని చేతిలో తుపాకులు పెట్టుకుని నిలబడి ఉన్నారు.
కిడ్నాప్ కు గురైన తన సమీప బంధువు కుల్దీప్ ను విడిపించడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నామని బీజేపీ శాసన సభ్యుడు బొలిన్ చెటియా చెప్పారు. కిడ్నాప్ కు గురైన కుల్దీప్ బీజేపీ శాసన సభ్యుడు బొలిన్ దగ్గరే పని చేస్తున్నాడు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొలిన్, కిడ్నాప్ కు గురైన కుల్దీప్ తండ్రి రత్నేశ్వర్ మోరన్ గత శాసన సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ప్రస్తుతం అసోంలో బీజేపీ అధికారంలో ఉంది. కుల్దీప్ మోరన్ ను విడిపించడానికి పోలీసు అధికారులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు.