మమతా బెనర్జీని కౌగిలించుకుంటానన్న బీజేపీ నేతకు కరోనా పాజిటివ్!
కోల్ కతా: తనకు కరోనా సోకితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ వ్యాఖ్యానించిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాకు.. ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఈయన కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
కొంచెం అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం సాయంత్రం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో బీజేపీ నేత హజ్రా మాట్లాడుతూ.. మమతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో సిలిగురి టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'మన కార్యకర్తలు కరోనా కంటే పెద్ద శత్రువుతో పోరాడుతున్నారు. వారంతా మమతా బెనర్జీతో పోరాడుతున్నారు. మమతా బెనర్జీతోనే మాస్కులు లేకుండా పోరాడుతున్న మన బీజేపీ కార్యకర్తలు.. కరోనాతో మాస్కులు ధరించకుండానే పోరాడగలరు' అని అనుపమ్ హజ్ర వ్యాఖ్యానించారు.
'నేను నిర్ణయించుకున్నా. ఒక వేళ నాకు కరోనా సోకితే.. నేను వెళ్లి మమతా బెనర్జీని హత్తుకుంటా' అంటూ అనుపమ్ హజ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలో టీఎంసీలో పనిచేసిన ఈ మాజీ ఎంపీ.. గత సంవత్సరమే బీజేపీలో చేరారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. సీఎం మమతా బెనర్జీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
'కరోనా బాధితులను మమతా బెనర్జీ దారుణంగా చూస్తున్నారు. వారి మృతదేహాలను కిరోసన్ పోసి తగలబెడుతున్నారు. కనీసం వారి కుటుంబసభ్యులకు ముఖం కూడా చూపించడం లేదు. మనం కుక్కలు, పిల్లులు చనిపోయినా అలా చేయలేం' అని అనుపమ్ హజ్రా అన్నారు.
Recommended Video
కాగా, సీనియర్ టీఎంసీ నేత సౌగతో రాయ్.. అనుపమ్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ మానసిక స్థితికి ఆయన వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు. అవి మతిలేని వ్యాఖ్యలని మండిపడ్డారు. ఆ బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా సిలిగురి టీఎంసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పోలీసులకు అనుపమ్ పై ఫిర్యాదు చేశామని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.