సుప్రీంకోర్టుకు చేరిన బీజేపీ రథయాత్ర..!
కోల్కతా : వెస్ట్ బెంగాల్ లో తలపెట్టిన రథయాత్రకు అనుమతివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు బీజేపీ నేతలు. కోల్కతా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదివరకే బీజేపీ రథయాత్రకు అనుమతిస్తూ ఏకసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించింది. అయితే ఆ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ పక్కన పెట్టింది. ఈక్రమంలో బీజేపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
2019 సాధారణ ఎన్నికలకు వ్యూహం రూపొందిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. 42 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని తలపెట్టారు. అయితే కోల్కతా హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో ఆటంకమేర్పడింది. బీజేపీ రథయాత్రతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో తృణమూల్ కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.
మొత్తానికి బీజేపీ రథయాత్ర కథ సుప్రీంకోర్టుకు చేరడంతో అనుకూల ఫలితమే వస్తుందని ఆశిస్తున్నారు ఆ పార్టీశ్రేణులు. ఈనేపథ్యంలో మరోసారి షెడ్యూల్ మార్చిన అమిత్ షా.. ఈనెల 28 నుంచి 31 వరకు వెస్ట్ బెంగాల్ లో రథయాత్ర నిర్వహించే ఛాన్సుంది.