వారిద్దరూ రేపిస్టులకు అనుకూలం కాదు: రామ్ మాధవ్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుండి వైదొలిగిన ఇద్దరు బిజెపి మంత్రులు తప్పు చేసినట్టు కాదని , ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ రామ్మాధవ్ అభిప్రాయపడ్డారు. కొన్ని సమయాల్లో విచక్షణ పాటించకపోవడమంటే తప్పు చేసినట్టు కాదన్నారు. అయితే కాశ్మీర్ ప్రభుత్వం నుండి వైదొలిగిన ఇద్దరు మంత్రులను అపార్ధం చేసుకోవడానికి అదే కారణమని ఆయన చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో మంత్రులుగా ఇద్దరు మంత్రులు ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఘటన విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు ఆ తర్వాత వీరిద్దరూ కూడ ముఫ్తీ మంత్రివర్గం నుండి వైదొలిగారు.
నిందితులకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో మంత్రులు పాల్గొనడంపై ముఖ్యమంత్రి ముఫ్తీ సీరియస్ అయ్యారు. అంతేకాదు మంత్రులను రాజీనామా చేయించాలని ఆమె బిజెపి నాయకత్వానికి సూచించారు. లేకపోతే ఎన్డీఏ నుండి బయటకు వస్తామని సంకేతాలు పంపారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మూ రాష్ట్ర బిజెపి వ్యవహరాల ఇంఛార్జీగా కొనసాగుతున్న రామ్మాధవ్ శ్రీనగర్కు చేరుకొన్నారు. ఆ రాష్ట్రంలో చోటు చేసుకొన్న 8 ఏళ్ళ మైనర్ బాలికపై రేప్, హత్య ఘటన, ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు.
కథూవా అత్యాచార ఘటనపై విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ లేఖ రాశారు.