గాలి కూతురు సంగీత్ అదుర్స్: ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ, వెళ్తానన్న యెడ్డీ
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మిణి వివాహ వేడుక వైభవంగా జరుగుతోంది. వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం అలరించింది. బుధవారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరగనున్న వివాహ వేడుకకు దాదాపు 50వేల మంది అతిథులు రానున్నారని తెలుస్తోంది.
బీజేపీ కొత్త ట్విస్ట్
గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెళ్లవద్దని తనకు ఎవ్వరూ చెప్పలేదని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పారు. ఈ పెళ్లికి బిజెపి నేతలు, నాయకులు ఎవరూ హాజరుకావద్దని ఆ పార్టీ అగ్ర నాయకత్వం చెప్పిందంటూ వార్తలు వచ్చాయి.
వీటిపై యడ్యూరప్ప స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేశారు. తనకు వివాహ ఆహ్వానం వచ్చిందని, తాను హాజరవుతున్నానని యెడ్డీ చెప్పారు.
గాలి పెళ్లి అదుర్స్: కబాలి, ముఠామేస్త్రీ డ్యాన్స్ (ఫోటోలు)
ప్రతిపక్ష నేత, బీజేపీ నేత జగదీశ్ శెట్టార్ కూడా ఇదే విషయం చెప్పారు. తమ వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలో పార్టీ నిర్ణయించదని, తాను కూడా పెళ్లికి హాజరవుతున్నానని చెప్పారు. పార్టీ ముఖ్య నేతలు కొందరు మాత్రం పెళ్లికి హాజరయ్యే విషయంలో తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.
బీజేపీ ఎంపీలు అనంతకుమార్, డీవీ సదానందలు హాజరు కాకపోవచ్చునని తెలుస్తోంది. కాగా, బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో రేపు (బుధవారం) పెళ్లి జరగనుంది. 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్లో గాలి అంగరంగ వైభవంగా తన కూతురు వివాహాన్ని రెడ్డి చేస్తున్నారు.