కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై తొలగని సస్పెన్స్.. అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీలో నేతల పడిగాపులు
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారు కుప్పకూలి రెండురోజులు గడిచాయి. మంగళవారమే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వినిపించినా పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. పార్టీ అధిష్టానంతో భేటీ అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు లేఖ సమర్పించాలని యడ్యూరప్ప భావించారు. అయితే ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో ఎటూ తేల్చకపోవడంతో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం హస్తినలో పడిగాపులు పడుతున్నారు. అయితే కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఆచితూచి అడుగులు వేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీ ఇలా చేయడం నేనేప్పుడు చూడలేదు... దేవేగౌడ
సీఎం పీఠంపై యడ్యూరప్ప కన్ను
కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గతంలో ఒకసారి బొక్కబోర్లా పడినందున ఈ సారి పక్కా ప్లాన్తో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎం పదవిపై ఆశతో ఉన్నారు. వాస్తవానికి 75ఏళ్లు దాటిన వారిని పక్కన బెట్టాలని బీజేపీ గతంలోనే నిర్ణయించింది. అయితే యడ్యూరప్ప విషయంలో ఈ నిబంధన అమలు చేయకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్పతో పాటు ఆయన కుమారుడు విజయేంద్ర యడ్యూరప్ప కూడా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీలో మకాం వేశారు.
అమిత్ షా వ్యూహం ఆధారంగా అడుగులు
బీజేపీ పెద్దల సలహా మేరకు ముందడుగు వేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన ఇచ్చే సూచనల ఆధారంగా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ భేటీలో యడ్యూరప్పను కొత్త సీఎంగా ఎన్నుకోనున్నారు. గతేడాది మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ సంఖ్యాబలం లేని కారణంగా 48 గంటల్లోపు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని బీజేపీ భావిస్తోంది.
యడ్యూరప్పను పక్కన బెట్టే ఛాన్స్..
ఇదిలా ఉంటే రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను నియమించే విషయంలో పార్టీ, ఆర్ఎస్ఎస్కు మధ్య విభేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ ఇష్టపడటం లేదన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. కార్వార ఎంపీ అనంతకుమార్ హెగ్డేకు సీఎం బాధ్యతలు అప్పజెప్పి, ఆర్. అశోక్, సీఎం ఉదాసి, బి. శ్రీరాములులలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. అయితే యడ్యూరప్పను పక్కనబెడితే తలెత్తే పరిస్థితుల గురించి కూడా అధిష్టానం సమాలోచనలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్ తేలిన తర్వాతే
16 మంది రెబెల్ ఎమ్మెల్యే భవిష్యత్తుపై స్పీకర్ నిర్ణయం తర్వాతే అడుగు ముందుకేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముంబైలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పట్లో బెంగళూరుకు తిరిగి వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఒకవేళ స్పీకర్ రమేష్ కుమార్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే వారికి బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కే అవకాశంగానీ, కనీసం ఉప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిగానీ ఉండదు. ఒకవేళ స్పీకర్ వారి రాజీనామాలను అంగీకరిస్తే ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
బీజేపీకి అత్తెసరు మెజార్టీ
కర్నాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులున్నారు. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే ఆ సంఖ్య 210కి చేరుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 105కు తగ్గుతుంది. ప్రస్తుతం బీజేపీకి 105మంది సభ్యుల మద్దతు ఉండగా... ఇద్దరు ఇండిపెండెంట్లు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే సైతం కమలనాథులకు అండగా నిలిచే అవకాశముంది. మొత్తమ్మీద డైలీ సీరియల్ను తలపిస్తున్న కర్నాటకానికి ఈ వారంలోనే తెరపడే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.