పాక్ ఉగ్రవాదులు అంతం అయితే సంబరాలా ? సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, రెండు వర్గాలో చిచ్చు !
బెంగళూరు: పాకిస్తాన్ మీద భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్- 2 దాడుల అనంతరం భారతదేశంలో జరుగుతున్న విజయోత్సవాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ నాయకులతో పాటు సోషల్ మీడియాలో సీఎం కుమాస్వామి మీద పలువురు మండిపడుతున్నారు. భారతదేశంలో జరుగుతున్న సంబరాల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైయ్య అవకాశం ఉందని సీఎం కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్ ఉగ్రవాదులు
ఒక కార్యక్రమంలో బహిరంగంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కుమారస్వామి పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాల మీద బాంబులు వేసి అంతం చేశారని రోడ్ల మీదకు వచ్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి విజయోత్సవాలు భారతదేశానికి మంచిది కాదని, రెండు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కారణం
భారతదేశంలో రోడ్ల మీద స్వీట్లు పంచిపెట్టి విజయోత్సవాలు నిర్వహించడానికి పరోక్షంగా బీజేపీ సహకరిస్తుందని సీఎం కుమారస్వామి ఆరోపించారు. తమ రాజకీయ స్వార్థం కోసం రెండు వర్గాల మద్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువలన అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని ఆ కార్యక్రమంలో సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పోరాటం అంటే సీఎం కు తెలుసా ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ కుమార్ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతసైనికులు ఎదురుదాడి చేసిన సందర్బంగా భారత్ మాతాకి జై అంటే మీకు అపచారంలా కనపడుతోందా అని సీఎం కుమారస్వామిని ప్రశ్నించారు. అసలు పోరాటం అంటేనే ఏమీ తెలీకుండా నేడు అధికారంలో ఉన్న సీఎం కుమారస్వామి ప్రజల నుంచి ఇంతకంటే ఎలా ఆశిప్తారు ? అని విమర్శించారు.
మోడీపై ద్వేషంతో పాక్ కు మద్దతు
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు కర్ణాటక ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే మండిపడ్డారు. పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తే ప్రజలు సంబరాలు చేసుకోవడం కుమారస్వామికి ఇష్టం లేదని, అది మతఘర్షణలు జరుగుతుందని ఆరోపిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యడానికి సీఎం కుమారస్వామి సిద్దం అయ్యారని బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే విమర్శించారు.
సోషల్ మీడియాలో చివాట్లు
పాక్ ఉగ్రవాదులను అంతం చేసిన తరువాత హిందూవులు, ముస్లీంలు, క్రిస్టియన్లతో పాటు అన్ని మతాల వారు సంబంరాలు చేసుకున్న విషయం కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గుర్తు చేసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో చివాట్లు పెడుతున్నారు. పాక్ ఉగ్రవాదులను అంతం చేశారని సంబరాలు చేసుకోవడంతో రెండు వర్గాల మద్య గొడవలు జరగవు అనే విషయం సీఎం కుమారస్వామి గుర్తు పెట్టుకోవాలని పలువురు ఆయన తీరు మీద మండిపడుతున్నారు.
వివాదంలో లీడర్స్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్ -2 వలన బీజేపీకి లాభం కలుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదులను అంతం చెయ్యడం వలన కర్ణాటలో 22 ఎంపీ సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బహిరంగంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.