నాకు ఓటు వేయలేదో... ఖబడ్దార్: వైరల్ అవుతున్న మేనకాగాంధీ వీడియో
ఓట్లు తమకే వేయాలంటూ ఓటర్లను బెదిరిస్తున్న ఇద్దరు నాయకులు కెమెరా కంటికి చిక్కి అడ్డంగా బుక్కయ్యారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులను చూశాం కానీ ఓటర్లను తమకే ఓటు వేయాలని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో ఎన్నికల వేళ ఆ పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నేతలు ఎవరు...?
ఓటర్లను బెదిరిస్తున్న మేనకా, సాక్షి మహారాజ్
ఎన్నికల వేళ ఓటర్లను పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేయడం ఎప్పుడూ వింటున్న వార్తే. అయితే తమకే ఓటువేయాలి లేదంటే మీ అంతు చూస్తాను అని బెదిరించే నేతలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇది ఓటమి భయం వల్ల వారు ఓటర్లను బెదిరిస్తున్నారని అక్కడి ఓటర్లు చెప్తుండటం విశేషం. తాజాగా బీజేపీకి చెందిన మేనక గాంధీ, వివాదాలకు పేరుగాంచిన సాక్షిమహారాజ్లు ఓటర్లను బెదిరిస్తూ కెమెరా కంటికి చిక్కారు.
ముస్లిం సామాజిక వర్గం వారిని బెదిరించిన మేనకాగాంధీ
కేంద్రమంత్రి మేనకా గాంధీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొందరి ఓటర్లను బెదిరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ముస్లిం ఓటర్లు తనకు ఓటు వేయకుంటే తాను విజయం సాధించిన తర్వాత ఎవరికీ ఒక్క సహాయం కూడా చేసేది లేదని చెబుతున్న మాటలు వీడియోలో కనిపించాయి. ముస్లిం సామాజిక వర్గం వారు తనకు ఓట్లు వేసిన వేయకపోయినా గెలుపు మాత్రం తనదే అంటూ చెప్పుకొచ్చారు మేనకా గాంధీ. తన ఫౌండేషన్ ద్వారా రూ.1000 కోట్లు ముస్లింలకు ఖర్చు చేశామని తీరా ఎన్నికలు వస్తే మాత్రం ముస్లింలు బీజేపీకి ఓటువేయరని తమకు చాలా బాధ కలుగుతుందని చెప్పడం వీడియోలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్లోని సుల్తాన్పూర్లో మేనకా గాంధీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ టికెట్పై ఆమె సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
నాకు ఓటు వేయకుంటే శపించేస్తా: సాక్షి మహారాజ్
ఇక మరో ఎంపీ సాక్షి మహారాజ్ ఎవరైతే తనకు ఓటు వేయరో వారిని బెదిరించడంతో పాటు శపించారు. ఉన్నావ్ నుంచి పోటీ చేస్తున్న సాక్షి మహారాజ్ ... ఓ సాధువు మీ ఇంటికొచ్చారని తను అడిగినది ఇవ్వకుంటే కుటుంబంలోని సంతోషాన్ని తీసుకెళుతాడంటూ శపించారు. ఇవన్నీ తాను చెబుతున్న మాటలు కాదని వివరణ ఇచ్చిన సాక్షి మహారాజ్ పురాణాలు కూడా ఇదే అంశం చెబుతున్నాయని ఓటర్లను బెదిరించారు. తాను డబ్బు లేదా భూమి అడగటం లేదని కేవలం ఓటు మాత్రమే అడుగుతున్నట్లు సాక్షి మహారాజ్ ఓటర్లతో చెప్పారు.
మొత్తానికి ఒకరు ముస్లిం సామాజిక వర్గాన్ని బెదిరించడం మరో ఎంపీ పురాణాల పేరుతో ఓటర్లను బెదిరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓటర్లు మాత్రం ఇవేమీ పట్టించుకోమని తమకు నచ్చిన వ్యక్తికే ఓటు వేస్తామని ఎవరికి ఓటువేయాలో ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నామని చెప్పుకొస్తున్నారు.