ఉద్దవ్ కు సీఎం షిండే మరో షాక్ - శివసేన కార్యాలయానికి సీల్ : స్పీకర్ గా నర్వేకర్..!!
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కంటిన్యూ అవుతున్నాయి. సీఎం ఉద్దవ్ థాక్రే పైన తిరుగుబాటు చేసి..సీఎం స్థానం దక్కించుకున్న షిండే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ వేళ..తన మార్కు నిర్ణయాలను అమలు చేస్తున్నారు. రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 164 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ తరపున రాజన్ సాల్వీ బరిలో నిలిచారు.
సమావేశాల కోసం అన్ని పార్టీల నేతలు అసెంబ్లీకి హాజరయ్యారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే..బీజేపీ మద్దతు ఉండటంతో నర్వేకర్ ఎన్నిక లాంఛనంగా మారింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరయ్యారు. వారితో పాటుగా 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, సభ ముందు షిండే తన బల నిరూపణ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు లేదా రేపు ఓటింగ్ జరగనుంది. ఇదే సమయంలో సీఎం షిండే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధాన్భవన్లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్ చేశారు. దాంతో పాటు కార్యాలయం తలుపు మీద నోటీసు అంటించారు.
శివసేన శాసనసభాపక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నాం అని దానిపై మరాఠీలో రాసి ఉంది. షిండే బల నిరూపణ ఉండటంతో హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డిప్యూటీ సీఎం.. బీజేపీ నేత ఫడ్నవీస్ దూరంగా ఉన్నారు. సోమవారం బల పరీక్ష పూర్తయిన తరువాత షిండే తన మంత్రి విస్తరణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. తన వర్గంగా నిలిచిన రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోది. అయితే, డిప్యూటీ సీఎంతో పాటుగా స్పీకర్ సైతం బీజేపీకి కేటాయించటంతో.. మంత్రివర్గ విస్తరణలో బీజేపీ ప్రాధాన్యత ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.