మోడీని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీకి షాక్, ఆ స్థానంలో రవిశంకర ప్రసాద్ పోటీ!
న్యూఢిల్లీ: బీహార్లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి శతృఘ్ను సిన్హా విజయం సాధించారు. గత కొద్దికాలంగా ఆయన పార్టీలో ఉంటూనే విపక్షాలకు ఆయుధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీపై పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. ఓ సమయంలో ఆయన పార్టీని కూడా వీడుతారనే ప్రచారం సాగింది. ఆయనను పార్టీ నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి.
బీజేపీ టిక్కెట్పై పోటీకి సెహ్వాగ్ నో, ఎందుకంటే? న్యూఢిల్లీ రేసులో గంభీర్, మౌనిక?
శతృఘ్నుసిన్హాకు షాక్.. ఆ స్థానం నుంచి రవిశంకర ప్రసాద్ పోటీ
అయితే, లోకసభ ఎన్నికల నేపథ్యంలో శతృఘ్ను సిన్హాకు పార్టీ అధిష్టానం షాకివ్వనుంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పట్నాసాహిబ్ స్థానం నుంచి కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ను బరిలోకి దింపాలని అధిష్టానం యోచిస్తోంది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి వరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. రవిశంకర ప్రసాద్తో పాటు ఆర్కే సిన్హా పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
పార్టీని ఇరకాటంలోకి నెట్టేలా
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పట్నా సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరుపై చర్చ జరిగిందని, ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు ఉన్నారని, రవిశంకర ప్రసాద్ను పోటీ చేయించుదామనే చర్చ వచ్చిందని ఓ బీజేపీ నేత చెప్పారు. పలు సందర్భాల్లో శతృఘ్ను సిన్హా తీరు పార్టీని ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరించారని చెప్పారు.
శతృఘ్ను సిన్హా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?
శతృఘ్ను సిన్హా ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీలో కొత్త నాయకత్వం పగ్గాలు చేపట్టడానికి ఇది సరైన సమయమని వ్యాఖ్యానించారు. తాను మళ్లీ పట్నాసాహిబ్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వేరే పార్టీలో చేరే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీ లేదా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, తొలి విడత అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తొలి విడతలో ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. ఈ రోజు ఆ జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి.