ఢిల్లీ మళ్లీ బీజేపీదే... కమలానికే 7 సీట్లంటున్న ఎగ్జిట్ పోల్స్..
Recommended Video
దేశ రాజధాని ఢిల్లీలో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ఈసారి కూడా మెజార్టీ సీట్లు తన అకౌంట్లో వేసుకోనున్నట్లు తెలుస్తోంది. న్యూస్ 18 అంచనా ప్రకారం 7సీట్లున్న ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ 6 నుంచి 7స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని కాంగ్రెస్ 1, ఆప్ ఖాతా తెరిచే ప్రసక్తేలేదని సర్వే స్పష్టం చేస్తోంది.
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ అంతరం.. ఆ మూడు రాష్ట్రాల లెక్కలపై అయోమయం
ఏబీపీ నీల్సన్ సర్వే ప్రకారం బీజేపీ ఐదు సీట్లలో సత్తా చాటనుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చెరొక స్థానాన్ని గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. ఇండియా టుడే యాక్సిప్ లెక్క ప్రకారం బీజేపీ 6 నుంచి 7, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించనుంది. ఢిల్లీలో బీజేపీ ఆరు కాంగ్రెస్ ఒక సీట్లు గెల్చుకుంటుందని టైమ్స్ నౌ అంటుండగా... 7సీట్లు అకౌంట్లో వేసుకుని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో ప్రభంజనం సృష్టించింది. 7 సీట్లలో విజయ బావుటా ఎగరేసింది. ఈ దెబ్బకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు దిమ్మ దిరిగి బొమ్మ కనబడింది. అయితే 2015 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. 70 స్థానాలకు జరిగిన ఎన్నికలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 67సీట్లు గెల్చుకుని రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే రిపీటవుతాయనుకున్న ఆప్కు ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.