బిజెపికి 200+ సీట్లు: అజహర్ రాజస్థాన్కు మార్పు
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 200కు పైగా సీట్లు వస్తాయని, ఎన్డీయో కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని జీ న్యూస్ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడయింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మహిమకు కాంగ్రెసు పైన జనాగ్రహం తోడుతో బిజెపి ప్రభ వెలిగిపోనుందట. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చిచెప్పాయి.
తాజాగా సర్వేలో కూడా ఇదే తేలింది. వచ్చే ఎన్నికల్లో బిజెపి సొంతంగా 200కు పైగా సీట్లు దక్కించుకోబోతోందని, ఎన్డీయే కూటమికి 217 నుంచి 231 సీట్లు రానున్నాయని ఆ ఛానల్ నిర్వహించిన సర్వేలో తేలింది. యూపిఏకు కూటమి 120 నుంచి 133 సీట్లు, తృతీయ కూటమి 83-115 సీట్లకు పరిమితమవుతాయని కూడా సర్వే నివేదిక పేర్కొంటోంది.
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 46 శాతం ప్రధాని పదవికి మోడీ వైపే మొగ్గు చూపగా, కేవలం 21.2 శాతం రాహుల్ గాంధీని పిఎం పదవిలో చూడాలనుకున్నారు. ప్రధాని పదవిలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ను చూడాలనుకుంటున్నవారు కేవలం 4.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 56 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 13,428 మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించి నివేదిక రూపొందించారు.
రాజస్థాన్ నుండి అజహరుద్దీన్
కాంగ్రెసు పార్టీ లోకసభ ఎన్నికల కోసం మూడో జాబితాను విడుదల చేసింది. కబిల్ సిబల్ను ఆయన పాత నియోజకవర్గమైన చాందినీ చౌక్ నుండి లోకసభ ఎన్నికల బరిలోకి దించడంలో కాంగ్రెస్ అధినాయకత్వం విజయం సాధించింది. లోకసభకు పోటీ చేసే 58 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను పార్టీ హైకమాండ్ మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్ర్తి విడుదల చేసిన మూడో జాబితాలో 58 మందికి టిక్కెట్లు కేటాయించారు.
పదిహేనవ లోకసభలో ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ను రాజస్తాన్లోని టోంక్ నియోజకవర్గానికి మార్చారు. అజీత్ జోగీ చత్తీస్గడ్లోని మహాసముంద్ నుండి పోటీ చేస్తారు. కపిల్ సిబల్కు చాందినీ చౌక్, జయప్రకాశ్ అగర్వాల్కు పశ్చిమ తూర్పు ఢిల్లీ, సందీప్ దీక్షిత్కు ఉత్తర ఢిల్లీ, అజయ్ మాకెన్కు న్యూఢిల్లీ, కృష్ణ తీరథ్కు ఉత్తర పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గాలను కేటాయించారు.
కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా ఒడిశాలోని బాలాసోర్, క్రికెటర్ అజరుద్దీన్ రాజస్తాన్లోని టోంక్ , సచిన్ పైలట్ అజ్మీర్ , జ్యోతి మిర్దా నాగోర్, చంద్రేశ్ కుమారి జోద్పూర్ నుండి లోకసభకు పోటీ చేస్తారు. మూడో జాబితాలో కూడా ఎపి నుంచి ఒక్కరి పేరు కూడా చోటు చేసుకోలేదు.