25 టార్గెట్: బిజెపికి పాశ్వాన్ హామీ, 7 స్థానాల్లో ఎల్జేపి!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ - రామ్ విలాస్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని ఎల్జేపిల మధ్య 2014 ఎన్నికల కోసం పొత్తు దాదాపు ఖరారైంది. కాంగ్రెస్ - ఆర్జేడీలు ఎనిమిది పార్లమెంటు స్థానాలను తమకు ఇచ్చేందుకు అంగీకరించక పోవడంతో పాశ్వాన్ బిజెపి వైపు మొగ్గు చూపారు.
బీహార్లో మొత్తం 42 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఎల్జేపికి బిజెపి ఏడు సీట్ల వరకు కేటాయించే అవకాశముంది. మిగిలిన స్థానాల్లో బిజెపి పోటీ చేయనుంది. లోక్ జన్ శక్తి పార్టీ(ఎల్జేపీ)తో సీట్ల సర్దుబాటుకు గల అవకాశాలను గుర్తించాలని బిజెపి అధిష్టానం బీహార్ రాష్ట్ర శాఖను కోరింది.
బీహార్కు బిజెపి రాష్ట్ర శాఖ పాశ్వాత్తో పొత్తును వ్యతిరేకించారు. ఎల్జేపిలో పలువురు సీనియర్ నేతలకు నేర చరిత్ర ఉందని, ఇది బిజెపి ప్రతిష్టను దెబ్బతీస్తుందని వారు అనుమానం. అయితే, టిక్కెట్ల విషయంలో పాశ్వాన్ను ఇతరులకు ఇప్పించేలా ఒప్పించుదామని అధిష్టానం రాష్ట్ర నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది.
బీహార్ జనాభాలో ఇరవై శాతం మంది దళితులు ఉన్నారు. వీరికి నేతృత్వం వహిస్తున్న వారిలో పాశ్వాన్ ప్రముఖులు. దళితుల ఓట్లను బిజెపికి పడేలా చూస్తానని పాశ్వాన్ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ముస్లిం ఓట్లు ఆర్జేడి - కాంగ్రెస్, జెడి(యు)ల మధ్య చీలిపోతాయని బిజెపి భావిస్తోంది.
మొత్తం నలభై స్థానాల్లో ఇరవై వరకు బిజెపికి, ఐదు లేదా ఆరు స్థానాలలో ఎల్జేపి గెలిచే అవకాశముంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇరవై అయిదు సీట్ల వరకు ఎన్డీయే ఖాతాలో పడుతాయని భావిస్తున్నారు.