బీజేపీ చేసిన సీఎం.. ఎన్డీఏలోనే ఉంటారా?: నితీశ్ కుమార్పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్లు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి బాధ్యతలు చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్. అంతేగాక, నితీశ్పై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. బీజేపీ చేసిన సీఎం అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
'మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా నితీశ్ కుమార్కు శుభాకాంక్షలు. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని అనుకుంటున్నా. అదే విధంగా మీరు ఎన్డీఏ తరపునే సీఎంగా కొనసాగుతారని భావిస్తున్నా' అని చిరాగ్ వ్యాఖ్యానించారు.
అంతేగాక, 'మిమ్మల్ని(నితీశ్ కుమార్) సీఎంగా చేసిన భారతీయ జనతా పార్టీకి, సీఎం అయినందుకు మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా' అని చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్యంగా అభినందనలు తెలియజేశారు. ఇక ఎల్జేపీ పంపిన మేనిఫెస్టోలోని హామీల్ని నెరవేర్చే దిశగా నితీశ్ పనిచేయాలని సూచించారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ.. ఒంటరిగానే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందడం గమనార్హం. అయితే, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే ఎల్జేపీ పోటీ చేయడం గమనార్హం. దీంతో జేడీయూ విజయం కేవలం 42 స్థానాలకే పరిమితమైంది.
కాగా, బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు తారకిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ ఈసారి అవకాశం దక్కలేదు. అయితే, ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.