అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రూ.2కే కిలో గోధుమపిండి.. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
Recommended Video
ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి ఎలాగైనాసరే జెండా పాతాలనుకుంటోన్న బీజేపీ.. ఆమేరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ తాయిలాలు సిద్ధం చేసింది. ఉచిత, సబ్సిడీలతో కూడిన అనేక కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది. ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో మేనిఫెస్టోలో ఎలాంటి హామీలుంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ తదితరులతో కలిసి ఢిల్లీ బీజేపీ చీప్ మనోజ్ తివారి శుక్రవారం 'ఢిల్లీ సంకల్ప పత్రం'(మేనిఫెస్టో)ను విడుదల చేశారు.
కీలక హామీలివే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలోని మొదటి పాయింట్... అవినీతిరహిత పరిపాలన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన కాలనీలకు డెవెలప్మెంట్ బోర్డుల ఏర్పాటు రెండోది. అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు సీలింగ్ విధానం తెస్తామని, కిరాయిదారులకు ఉపశమనం కల్పిస్తామని, ప్రస్తుత ఢిల్లీ సర్కారు పక్కన పెట్టేసిన ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన లాంటి పథకాల్ని అము చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్ తదితర కీలక హామీలిచ్చారు.
ఫ్రీ.. ఫ్రీ..
ఆప్ ప్రభుత్వం గోధుమలు ఇస్తున్నప్పటికీ.. వాటిని గిర్నీ పట్టించుకోడానికి జనం ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పేదలందరికీ రెండు రూపాయలకే గోధుమపిండి అందసేస్తామని బీజేపీ వాగ్ధానం చేసింది. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, స్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కొత్తగా 200 స్కూల్లు, 10 కాలేజీలూ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
10లక్షల ఉపాధి..
ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో కనీసం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీ బీసీ, అగ్రవర్ణ పేదల కోసం వేర్వరుగా డెవెలప్మెంట్ బోర్డలు, పిల్లల పెళ్లిళ్ల కోసం ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం, ఢిల్లీ-యమునా వికాస్ బోర్డు, 20 సూత్రాల పథకంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్, స్టార్ట్ అప్ లకు పోత్సాహంతోపాటు ఫిట్ ఇండియా-ఫిట్ ఢిల్లీ పథకాన్ని అమలు చేస్తామనీ బీజేపీ నేతలు తెలిపారు.
కేజ్రీవాల్ కేబినెట్లో సగం మంది కేడీలే..
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఐదేళ్ల పాలనలో ఢిల్లీ అన్నిరకాలుగా వెనుకబడిపోయిందని, కేజ్రీవాల్ కేబినెట్ లోని మంత్రుల్లో సగంమందికిపైగా చీటింగ్, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారేనని, అభివృద్ధి పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతో ‘‘మేరా ఢిల్లీ.. మేరా సుజావ్'' కాన్సెప్ట్ తో పాలన సాగిస్తామని, జల, వాయికాలుష్య రహిత నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని బీజేపీ నేతలు వాగ్దానం చేశారు.