ట్విస్ట్: 'ఎక్కువ సీట్లు గెలిచేది బీజేపీయే, మోడీ మాత్రం మరోసారి ప్రధాని కాలేరు'
న్యూఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే అత్యధిక స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని, కానీ నరేంద్ర మోడీ మాత్రం రెండోసారి ప్రధానమంత్రి కాబోరని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని, కానీ ఇతర పార్టీల మద్దతు అవసరం అవుతుందని, ఈ నేపథ్యంలో మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని జోస్యం చెప్పారు.
మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లను బీజేపీ గెలిచే అవకాశం లేదని చెప్పారు. బీజేపీ పెద్ద పార్టీగా అవతరించి, ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుందని, మోడీని ప్రధానిగా చేసేందుకు పలు పార్టీలు సిద్ధంగా లేవని శరద్ పవార్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిపై మార్చి 14, 15 తేదీల్లో మరింత స్పష్టత వస్తుందన్నారు.
అమిత్ షాపై వ్యంగ్యాస్త్రాలు
మహారాష్ట్రలోని 48 లోకసభ స్థానాలకు గాను 45 సీట్లలో తమ కూటమి గెలుస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పడంపై శరద్ పవార్ స్పందిస్తూ... ఆయన తప్పుగా చెప్పారని, అసలు మొత్తం సీట్లు వారే గెలుధిస్తారని ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి నుంచి చిన్న పార్టీలు తప్పుకోవడంపై శరద్ పవార్ స్పందించారు. కొన్ని పార్టీలు వెళ్లినప్పటికీ మరికొన్ని పార్టీలు కలుస్తాయన్నారు. ఎన్సీపీకి పీడబ్ల్యుపీ అండగా నిలిచినందుకు సంతోషమన్నారు. స్వాభిమాన్ షెట్కారి సంఘటన పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
అందుకే పోటీకి దూరం
2012 నుంచే శరద్ పవార్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ఇటీవల ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల ఆయన పోటీ చేయవద్దని మనసు మార్చుకున్నారు. తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. తమ కుటుంబం నుంచి ఇద్దరు పోటీకి సిద్ధంగా ఉన్నారని, ఎవరో ఒకరు తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన తగ్గినట్లుగా తెలుస్తోంది.