జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?
ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు అప్పజెప్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా రేసులో జేడీఎస్, బీజేడీల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ వైసీపీని పక్కనబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రపతి ప్రసంగమంటే లెక్కలేదా .. ఫోన్తో రాహుల్ బిజీ బిజీ ...
డిప్యూటీ స్పీకర్ రేసులో వైసీపీ
లోక్సభలో అధికారపార్టీ తమకు అనుకూలంగా ఉండే మరో పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ సంఖ్యాబలం ఉన్న పార్టీ వైసీపీయే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకే డిప్యూటీ పగ్గాలు అప్పగించే అవకాశముందన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే వైసీపీ బహిరంగంగా మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామన్న జగన్ ఎన్డీఏ సర్కారులో చేరితే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకరించి మోడీ సర్కారుకు వైసీపీ సహకరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వైసీపీకే పక్కనబెట్టినట్లేనా?
2021 వరకు రాజ్యసభలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేదు. ఈ పరిస్థితుల్లో ఎగువ సభలో ఏవైనా బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ తదితర పార్టీల మద్దతు అవసరం. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక జరిగితే ఆ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఈ నేపథ్యంలో జగన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
జేడీయూతో చెడిన దోస్తానా
మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం లభించలేదన్న కారణంతో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఘన విజయం సాధించాయి. అయితే ప్రస్తుతం అలకబూనిన నితీశ్ను ఒప్పించేందుకు డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆ పార్టీకి ఇచ్చేందుకు మోడీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ సైతం డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ పోస్టు జేడీయూకే దక్కే అవకాశముందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.