ఎన్ఆర్సీ రేపిన చిచ్చు.. తొలుత వెళ్లేది తివారీ అన్న కేజ్రీ.. సీఎం ఇంటి ఎదుట నిరసన
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) చిచ్చు హస్తినలో అగ్గిరాజేసింది. ఢిల్లీలో కూడా ఎన్ఆర్సీ అమలు చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిమాండ్ చేయడంతో సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. హస్తినలో జాతీయ పౌరసత్వ రిజిస్టార్ అమలు చేస్తే తొలుత వెళ్లేది మీరేనని అనడంతో గొడవకు కారణమైంది. కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ పూర్వాంచల్ మోర్చా కేజ్రీవాల్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది.
ఎన్ఆర్సీ అమలు చేస్తే మొదట మనోజ్ తివారీ ఢిల్లీ నుంచి వెళతారని కేజ్రీవాల్ అనడంతో పూర్వాంచల్ మోర్చా విభాగం భగ్గుమంది. ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం ఇంటి వద్దకు విద్యార్థి నేతలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే బ్యారికేడ్లను దాటుకొని వచ్చారు. బీజేపీ కమలం గుర్తు ఉన్న జెండాలు పట్టుకొని కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి క్రమంగా చేయిదాటడంతో పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు.
ఢిల్లీలో చాలా మంది విదేశీయులు ఉన్నారని మనోజ్ తివారీ ఆరోపించారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఉన్నారని .. అందుకోసమే ఎన్ఆర్సీ అమలు చేయాలని కోరారు. దీనిపై బుధవారం కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. అలా అమలు చేస్తే తొలుత వెళ్లేది మీరేనని అనడంతో వివాదం మొదలైంది. అంటే ఢిల్లీలో వలసదారులు పూర్వాంచల్కు చెందినవారని కేజ్రీవాల్ భావిస్తున్నారా అని తివారీ ప్రశ్నించారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు హస్తినలో కీ రోల్ పోషిస్తారు. మనోజ్ తివారీ స్వస్థలం కూడా ఈశాన్య రాష్ట్రం కావడం విశేషం. బీహర్, ఉత్తర్ ప్రదేశ్కు చెందిన నేతలు హస్తినలో ముఖ్యభూమిక పోషిస్తుంటారు. ఈ క్రమంలోనే తివారీ ఎన్ఆర్సీ కామెంట్లు .. దానికి కేజ్రీవాల్ కౌంటర్ ఇవ్వడంతో అగ్గిరాజేసింది.